తెలంగాణ

telangana

అసోం-మిజోరం హింసపై కాంగ్రెస్ ఫైర్

By

Published : Jul 27, 2021, 12:25 PM IST

అసోం-మిజోరం సరిహద్దు హింసపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజల్లో అపనమ్మకం, విద్వేషాలను నింపుతున్నారని ధ్వజమెత్తింది. లోక్​సభలో దీనిపై చర్చించాలని డిమాండ్ చేసింది. మరోవైపు, టీఎంసీ సైతం ఈ ఘటనపై విమర్శలు గుప్పించింది.

rahul gandhi
రాహుల్ గాంధీ

అసోం-మిజోరం సరిహద్దులో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజల్లో అపనమ్మకం, విద్వేషాలను నింపుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ భయంకర పరిణామాల పర్యవసనాలను దేశం ఇప్పుడు చవిచూస్తోందని అన్నారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్.. హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతోపాటు హింసకు సంబంధించినదిగా పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

కమిటీ ఏర్పాటు

మరోవైపు, ఈ ఘటనపై నిజనిర్ధరణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ చాచర్ సహా రెండు రాష్ట్రాల సరిహద్దులో అలజడులు తలెత్తిన ప్రాంతాల్లో పర్యటిస్తారని పార్టీ తెలిపింది. అసోం కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు భూపెన్ బోరా కమిటీకి నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది.

అదే సమయంలో, ఈ అంశంపై చర్చ జరపాలని లోక్​సభలో కాంగ్రెస్ ఉపసభాపక్ష నేత గౌరవ్ గొగొయి డిమాండ్ చేశారు. దీనిపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హింసపై దర్యాప్తు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేకంగా లేఖ రాశారు.

ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు: టీఎంసీ

అసోం-మిజోరాం సరిహద్దు ఘటనపై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. భాజపా హయాంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలు.. దేశంలో ప్రజాస్వామ్యానికి చివరి రోజులకు ఆహ్వానం పలుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'శౌర్య, పరాక్రమాలకు సీఆర్​పీఎఫ్ బలగాలు నిదర్శనం'

ABOUT THE AUTHOR

...view details