తెలంగాణ

telangana

పడవ బోల్తాపడి 14మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మృతి- విహార యాత్రకు వెళ్లగా ప్రమాదం

By PTI

Published : Jan 18, 2024, 6:33 PM IST

Updated : Jan 18, 2024, 10:58 PM IST

Gujarat Boat Capsized News : గుజరాత్​ వడోదరాలో ఘోరం జరిగింది. హర్ణి మోట్​నాథ్​ సరస్సులో ఓ పడవ బోల్తా పడి 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు​ మరణించారు.

Gujarat Boat Capsized Several Died
Boat Capsized In Gujarat

Gujarat Boat Capsized News : గుజరాత్​ వడోదరాలోని హర్ణి మోట్​నాథ్​ సరస్సులో జరిగిన బోటు ప్రమాదంలో 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు​ మరణించారు. ప్రమాద సమయంలో పడవలో 27 మంది ఉన్నట్లు, వీరంతా విహారయాత్ర కోసం వెళ్లినట్లు జిల్లా కలెక్టర్​ ఏబీ గోర్ తెలిపారు​. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టారు. ఈ ప్రమాదం పట్ల ఆ రాష్ట్ర విద్యాశాఖమంత్రి కుబేర్ దిండోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"విద్యార్థులు ప్రయాణిస్తున్న బోటు సరస్సులో బోల్తాపడినట్లు నాకు సమాచారం అందింది. విహారయాత్ర కోసం వచ్చిన మొత్తం 27 మంది విద్యార్థులు ఈ బోటు ఎక్కారు. ప్రమాదవశాత్తు ఇది నీటమునిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్​డీఆర్​ఎఫ్​, అగ్నిమాపక శాఖ సహా ఇతర రెస్క్యూ ఏజెన్సీ బృందాలు గల్లంతయిన మిగతా విద్యార్థుల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి."
- కుబేర్ దిండోర్, గుజరాత్​ విద్యాశాఖ మంత్రి

ఏడుగురిని సేఫ్​గా
రెస్క్యూ ఆపరేషన్​లో ఇప్పటివరకు 10 మంది విద్యార్థులను కాపాడినట్లు ఫైర్​ ఆఫీసర్​ చీఫ్​ పార్థ్​ బ్రహ్మ్​భట్​ వెల్లడించారు. తమ బృందం ఘటనాస్థలికి చేరేకన్నా ముందే కొందరు స్థానికులు విద్యార్థులను కాపాడినట్లు ఆయన తెలిపారు. విహారయాత్రలో భాగంగా బోటింగ్​ కోసం వచ్చిన 27 మందిలో 23 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా న్యూ సన్​రైజ్​ స్కూల్​కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది.

'బోటులో ప్రయాణిస్తున్న 23 మంది విద్యార్థుల్లో కేవలం 11 మంది మాత్రమే లైఫ్​ జాకెట్లను ధరించారు. మిగతావారంతా ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పటిదాకా 10 మందిని రక్షించగలిగాము. వీరిలో కూడా ఒక విద్యార్థి మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. మరొక విద్యార్థిని ఎస్​ఎస్​జీ ఆస్పత్రికి తరలించాము' అని ఫైర్​ ఆఫీసర్​ చీఫ్ చెప్పారు. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కొక్కరిగా ఘటనాస్థలికి చేరుకుంటున్నారు.

ప్రమాదం బాధ కలిగించింది : మోదీ
బోటు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 'వడోదరలోని హర్ణి సరస్సులో జరిగిన బోటు ప్రమాదంలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ సమయంలో మృతుల కుటుంబాలకు పూర్తి మద్దతు ఉంటుంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఘటనాస్థలిలో చిక్కుకున్న వారికోసం స్థానిక యంత్రాంగం అన్ని విధాలా శ్రమిస్తోంది' అని ట్విట్టర్​ వేదికగా తన విచారం వ్యక్తం చేశారు. ఇక చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి ఎక్స్​గ్రేషియా కింద రూ.2 లక్షలు, అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన వారికి రూ.50,000 వేల చొప్పున పరిహారం ప్రకటించారు మోదీ.

సీఎం సంతాపం
ఈ దుర్ఘటనపై గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే దీనికి సంబంధించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ బాధ్యతలను వడోదర జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పగించారు. 10 రోజుల్లోగా సమగ్ర నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం ముందు హాజరుకావాలని కోరారు. పడవ బోల్తా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించారు సీఎం. అనంతరం ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్​కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

'మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తాము'
మరోవైపు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ ఘటనపై స్పందించారు. బోటు ప్రమాద ఘటన హృదయ విదారకం అని పేర్కొన్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 'ఈ సమయంలో మృతుల కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము. వారికి మా ప్రగాఢ సానుభూతిని తేలియజేస్తున్నాము' అని ఏఐసీసీ చీఫ్​ అన్నారు. ఇక ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వడోదరా ఎంపీ రంజన్​బెన్​ ధనంజయ్​ భట్​.

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- 23 మంది మృతి

పడవ బోల్తా- 8 మంది మృతి- 100మంది గల్లంతు

Last Updated :Jan 18, 2024, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details