నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసేంత వరకు దిల్లీ సరిహద్దుల్ని విడిచివెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకూర్చున్నారు రైతులు. ఓ రైతు ఏకంగా ఒక అడుగు ముందుకేసి సింఘూ సరిహద్దులోని రైతు ఆందోళన ప్రదేశంలో శాశ్వత నివాసాన్ని నిర్మించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఇటుకలు, సిమెంటు తెచ్చుకుని ఇంటి నిర్మాణం మొదలెట్టాడు. జీటీ కర్నల్ రోడ్డులో నిర్మించుకుంటున్న రెండు గదుల ఇంటిలో ఏసీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు.
కొద్దిరోజులు గడిచాకైనా రైతులు ఇంటికి వెళతారు అని కేంద్రం భావించిందని భగత్ సింగ్ యూత్ బ్రిగేడ్ అనే సామాజిక మాధ్యమాన్ని నడుపుతున్న దీప్ ఖాత్రి అనే వ్యక్తి అన్నాడు. కానీ సాగు చట్టాల్ని రద్దు చేసేంతవరకు రైతులు దిల్లీని వదిలి వెళ్లరని ఈటీవీ భారత్కు తెలిపారు.