తెలంగాణ

telangana

యూపీలో నాలుగో దశ ఎన్నికలు​ ప్రశాంతం- 60% పోలింగ్!

By

Published : Feb 23, 2022, 6:01 PM IST

Updated : Feb 23, 2022, 10:14 PM IST

UP Assembly Elections: ఉత్తర్​ ప్రదేశ్​లో నాలుగో విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 9.30 గంటల వరకు 59.77 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దఫా మొత్తం 624 మంది బరిలో నిలవగా.. మార్చి 10న వీరి భవితవ్యం తేలనుంది.

fourth phase of UP Assembly elections
fourth phase of UP Assembly elections

UP Assembly elections: యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 9.30 గంటల వరకు 59.77 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​​ జరిగింది. ఈ దశలో మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 624 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. యూపీ న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్‌ పాఠక్‌ లఖ్‌నవూ కంటోన్మెంట్‌, మరోమంత్రి అశుతోష్‌ టాండన్‌ లఖ్‌నవూ తూర్పు నుంచి పోటీ చేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న లఖ్​నవూ వాసులు
ఓటేసేందుకు వచ్చిన జనం
ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో ఓటేసేందుకు భారీగా తరలివచ్చిన ఓటర్లు

ఓటేసిన ప్రముఖులు..

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. లఖ్​నవూలోని ఓ పోలింగ్​ కేంద్రంలో తన ఓటు వేశారు.

ఓటేసిన అనంతరం వేలును చూపిస్తూ రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

బీఎస్​పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ఉదయమే ఓటు వేశారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే.. లఖ్​నవూలోని మున్సిపల్ నర్సరీ స్కూల్​కు చేరుకున్న మాయావతి.. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​లో ఓటేశారు.

ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న బీఎస్​పీ అధినేత్రి మాయావతి
లఖ్​నవూలోని ఓ బూలింగ్​ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్న యూపీ ఉపముఖ్యమంత్రి దినేశ్​ శర్మ

నిఘాసన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని లఖింపుర్‌ ఖేరీలో భాజపా నేత, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా భారీ భద్రత మధ్య పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

లఖింపుర్​ ఖేరీలో 65.54 శాతం పోలింగ్​ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ దశలో అత్యధికంగా పీలీభీత్​లో 67.59 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.

భారీ భద్రత మధ్య పోలింగ్​ కేంద్రానికి కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా
ఉన్నావ్​లో ఓటు వేస్తున్న భాజపా ఎంపీ సాక్షి మహారాజ్​

లఖింపుర్​ ఖేరీలోని ఓ పోలింగ్​ బూత్​ వద్ద కేవలం అండర్​వేర్​, మాస్క్​ ధరించి ఓటేసేందుకు వచ్చాడు ఓ యువకుడు. తొలుత మాస్క్​ ధరించకుండా వచ్చిన అనురాగ్​ మౌర్యను ఓటు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతించలేదు. దీనికి నిరసనగా ఇంటికి వెళ్లిన మౌర్య.. అండర్​వేర్, మాస్క్​ మాత్రమే ధరించి వచ్చి ఓటేశాడు. ​

అండర్​వేర్​పైనే వచ్చి ఓటేసిన యువకుడు

లఖ్‌నవూ, లఖింపుర్​ ఖేరీ సహా దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఈ విడతలోనే.. ఓటింగ్‌ జరిగింది.

ఇప్పుడు పోలింగ్​ జరిగిన 59 స్థానాల్లో.. 2017 ఎన్నికల్లో భాజపా- 51, ఎస్​పీ- 4, బీఎస్​పీ- 3, అప్నాదళ్‌ ఒకచోట గెలుపొందాయి. మొత్తం.. ఏడు విడతల్లో యూపీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

ఇవీ చూడండి:ఎన్నికల ప్రచార ఆంక్షల్లో మరిన్ని సడలింపులు.. వాటికి ఈసీ ఓకే

యూపీ ఎన్నికలు.. ఉదయమే ఓటేసిన మాయావతి

Last Updated : Feb 23, 2022, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details