తెలంగాణ

telangana

4 పిల్లలకు జన్మనిచ్చిన చీతా.. 70 ఏళ్ల తర్వాత భారత్​లో తొలిసారి

By

Published : Mar 29, 2023, 4:29 PM IST

Updated : Mar 29, 2023, 5:50 PM IST

దశాబ్దాల తర్వాత భారత్‌లో చీతాలు మళ్లీ పుట్టాయి. 1947 తర్వాత దేశంలో చీతాల సంతతి మళ్లీ మొదలైంది. గత ఏడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒక దానికి నాలుగు పిల్లలు జన్మించాయని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్‌లో తెలిపారు. 1952లో చీతాలు అంతరించిపోయినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ చీతాలు దేశంలో జన్మించడంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చీతాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

cheetah birth cubs
cheetah birth cubs

భారత గడ్డపై 7 దశాబ్దాల తర్వాత చీతాలు మళ్లీ జన్మించాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒక దానికి నాలుగు పిల్లలు జన్మించాయని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్‌లో తెలిపారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాల్లో ఒకటి ఇటీవలే కిడ్నీ సమస్యతో మరణించింది. అయితే మరొక చీతా నాలుగు పిల్లలకు జన్మనివ్వడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.

70 ఏళ్ల తర్వాత భారత్​లో తొలిసారి
భూమి మీద అత్యంతవేగంగా పరిగెత్తే జంతువైన చీతాలు.. భారత్‌లో 74ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. దేశంలో చివరి చీతా 1947లో ఛత్తీస్‌గఢ్​లో చనిపోవడం వల్ల.. 1952లో చీతాలు పూర్తిగా అంతరించిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశంలో చిరుతల సంఖ్యను తిరిగి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం విదేశాల నుంచి చీతాలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్​లో ప్రధానమంత్రి మోదీ బర్త్​ డే సందర్భంగా.. నమీబియా నుంచి 8 చీతాలను భారత్ తీసుకొచ్చారు. వీటిలో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చి కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. చీతాలను నిరంతరం పర్యవేక్షించడానికి రేడియో కాలర్లు అమర్చారు. రానున్న రోజుల్లో మరిన్ని చీతాలను భారత్‌కు రానున్నాయని అధికారులు తెలిపారు. వీటిలో 7 మగ చిరుతలు, 5 ఆడ చిరుతలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్​ యాదవ్​ చెప్పారు.

అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని ప్రయోగాత్మకంగా భారత్‌లో పునఃప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్‌ చీతాకు 2020 జనవరిలో సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. భారతీయ వన్యప్రాణి సంరక్షకులు తొలిసారిగా 2009లో భారత్‌కు చీతాలను రప్పించే ప్రతిపాదనను చీతా కన్జర్వేషన్‌ ఫండ్‌కు చెందిన ప్రతినిధుల ముందుంచారు. అనంతరం భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆ సంస్థ ప్రతినిథి డాక్టర్‌ మార్కర్‌ గత 12 ఏళ్లలో పలుమార్లు భారత్‌లో పర్యటించారు. చీతాలను ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ప్రాంతాన్ని, ముసాయిదా ప్రణాళికలను పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులను గమనించిన తర్వాత చీతాల సంరక్షణ అంశంపై గతేడాది జులై 20న నమీబియా, భారత్‌లు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. 8 చీతాలను భారత్‌కు పంపించడానికి ఒప్పందం చేసుకున్నారు.

ఇవీ చదవండి :లొంగిపోయేందుకు అమృత్​పాల్ రెడీ.. ఆయనతో మీటింగ్ తర్వాతే పోలీసుల వద్దకు..

'నన్ను లైంగికంగా వేధించారు.. వారిని ఇప్పటికీ మర్చిపోలేను'.. జిల్లా కలెక్టర్​

Last Updated :Mar 29, 2023, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details