ETV Bharat / bharat

లొంగిపోయేందుకు అమృత్​పాల్ రెడీ.. ఆయనతో మీటింగ్ తర్వాతే పోలీసుల వద్దకు..

author img

By

Published : Mar 29, 2023, 5:20 PM IST

Updated : Mar 29, 2023, 6:56 PM IST

amritpal-singh-surrender
amritpal-singh-surrender

గత పది రోజులుగా పోలీసుల కంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్‌ మద్దతుదారుడు, వారిస్ పంజాబ్‌ దే చీఫ్‌ అమృత్‌పాల్ లొంగిపోయే యోచనలో ఉన్నాడని తెలుస్తోంది. సిక్కులకు పవిత్రమైన శ్రీ అకాల్ తఖ్త్​ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఖలిస్థాన్ అనుకూలవాది, వారిస్ పంజాబ్ దే చీఫ్ అధినేత అమృత్​పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు. సిక్కులకు పరమపవిత్రంగా భావించే శ్రీ అకాల్ తఖ్త్​ సాహిబ్ నుంచి వచ్చిన పిలుపు మేరకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ జథేదార్ జ్ఞాని హర్​ప్రీత్ సింగ్​తో సమావేశమైన అనంతరం అమృత్​పాల్.. పోలీసులకు లొంగిపోనున్నాడని సమాచారం. లొంగిపోయే ముందు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వాలని అమృత్‌పాల్ ఆలోచించాడని పంజాబ్‌ పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో అమృత్‌పాల్ తన మనసు మార్చుకున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.

వీడియో రిలీజ్ చేసిన అమృత్​పాల్​
ఈ వార్తల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో అతని వీడియో కలకలం రేపింది. వీడియోలో నల్లటి తలపాగా, శాలువా ధరించి అమృత్‌పాల్ దర్శనమిచ్చాడు. తనను పట్టుకునే ప్రయత్నంలో సిక్కు యువకులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేయడంపై మండిపడ్డాడు. పంజాబ్ ప్రభుత్వానికి తనను అరెస్టు చేయాలనే ఉద్దేశ్యం ఉంటే.. పోలీసులు నేరుగా తన ఇంటికి వచ్చి ఉండాల్సిందని పేర్కొన్నాడు. తనను అరెస్టు చేయడానికి ప్రభుత్వం పంపిన లక్షల మంది పోలీసుల నుంచి దేవుడు రక్షించాడని అన్నాడు.

'అరెస్ట్ చేయలేదు'
మరోవైపు, అమృత్​పాల్​ను ఇంకా అరెస్ట్ చేయలేదని పంజాబ్ ప్రభుత్వం.. పంజాబ్, హరియాణా హైకోర్టుకు తెలిపింది. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అతడిని అదుపులోకి తీసుకోలేకపోయామని వెల్లడించింది. అమృత్​పాల్​ను అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ఇమాన్ సింగ్ ఖాడా అనే వ్యక్తి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ వివరణను ఆలకించింది. అమృత్​పాల్​ను అరెస్ట్ చేశారని చెప్పేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, అవి సమర్పించేందుకు తనకు సమయం కావాలని ఇమాన్ సింగ్ మంగళవారం పేర్కొన్నాడు.

భారీ ఆపరేషన్
పది రోజుల క్రితం అమృత్​పాల్ సింగ్ కోసం భారీ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు.. అతడిని పట్టుకోలేక పోయారు. చిక్కినట్టే చిక్కి పారిపోయిన అమృత్​పాల్ కోసం పోలీసులు పంజాబ్‌లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అమృత్​పాల్ నేపాల్ మీదుగా కెనడా పారిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నేపాల్ అధికారులకు భారత్ నుంచి ఈ మేరకు సమాచారం సైతం అందిందని ఆ దేశంలోని వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. అయితే, పోలీసుల నుంచి ఎంతో కాలం తప్పించుకోలేనని భావించిన అమృత్‌పాల్ లొంగిపోయేందుకు పంజాబ్‌కు వచ్చాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు అమృత్‌పాల్‌ ఇంటర్వ్యూ ఇవ్వాలనుకు‌న్నాడని పేర్కొన్నాయి.

పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న అమృత్‌పాల్ సింగ్ , అతని అనుచరులను పట్టుకునేందుకు పోలీసులు అణువణువూ జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌కు అమృత్‌పాల్ వచ్చాడన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. చుట్టు పక్కల గ్రామాల్లో వెతికారు. మరైయన్ గ్రామంలోని గురుద్వారా వద్ద అమృతపాల్ తన కారును అక్కడే వదిలేసి పొలాల్లోకి పారిపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు వెళ్లి కారును స్వాధీనం చేసుకున్నారు. మరైయన్‌ చుట్టుపక్కల గ్రామాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ బారికెడ్లు, చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.

ఎవరీ అమృత్​పాల్?
ఏడాది క్రితం వరకు అమృత్​పాల్ అనామకుడు. ఎవరికీ తెలియని ఓ సాధారణ వ్యక్తి. కనీసం తలపాగా కూడా ధరించకుండా మోడ్రన్ లైఫ్​స్టైల్​ను అనుసరించేవాడు. తన బంధువుల రవాణా బిజినెస్​లో మద్దతుగా ఉండేందుకు దుబాయ్​కు వెళ్లాడు. సాధారణ యువకుల్లాగే సోషల్ మీడియాలో అధిక సమయం గడిపేవాడు. కానీ, వారిస్ పంజాబ్ దే వ్యవస్థాపకుడు, నటుడు దీప్​ సిద్ధూ మరణం.. అమృత్​పాల్ జీవితాన్ని మార్చేసింది. దీప్​ సిద్ధూ అనుచరులకు మార్గదర్శనం చేసే వారు లేకపోయారు. దీంతో ఈ అవకాశాన్ని తెలివిగా అందిపుచ్చుకున్నాడు అమృత్​పాల్. కొద్దిరోజులకే తనను తాను వారిస్ పంజాబ్ దే సంస్థకు అధినేతగా ప్రకటించుకున్నాడు. మొదట్లో అమృత్​పాల్ కుటుంబ సభ్యులు ఇందుకు అనుమతించలేదు. కానీ కొద్ది సమయంలోనే అమృత్​పాల్ బాగా పాపులర్ అయ్యాడు. అతడిపై నిఘా పెట్టిన భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు.. అమృత్​పాల్​కు ఐసిస్​తోనూ సంబంధాలు ఉన్నాయని గుర్తించాయి.

Last Updated :Mar 29, 2023, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.