తెలంగాణ

telangana

బాణసంచా నిషేధం బేఖాతరు.. దిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత.. కానీ!

By

Published : Oct 25, 2022, 10:26 AM IST

Updated : Oct 25, 2022, 1:50 PM IST

దిల్లీలో వాయు నాణ్యత మరింత పడిపోయింది. బాణసంచాపై ఉన్న నిషేధాన్ని దిల్లీవాసులు లెక్కచేయలేదు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత అతితీవ్ర స్థాయికి చేరింది. అయితే, గత నాలుగేళ్లతో పోలిస్తే దీపావళి తర్వాత వాయుకాలుష్యం ఈసారి తక్కువగానే ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.

delhi-air quality
delhi-air quality

దేశ రాజధాని ప్రాంతం వాసులు మరోసారి విషపూరితమైన గాలిని పీల్చే పరిస్థితి నెలకొంది. దిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. గాలి నాణ్యత సూచీ 'తీవ్రమైన' స్థాయికి పడిపోయింది. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత 'అతితీవ్ర' కేటగిరీలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

వాయుకాలుష్యం నేపథ్యంలో దిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను దిల్లీ వాసులు ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో దిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) 323 పాయింట్లుగా నమోదైంది. అయితే, గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ దీపావళి తర్వాత దిల్లీలో కాలుష్యం స్థాయి తక్కువగానే ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.

దిల్లీ-ఎన్​సీఆర్ పరిధిలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోవడం, గాలి వేగం మందగించడం వంటి కారణాల వల్ల వాయు నాణ్యత క్షీణించిందని నిపుణులు చెబుతున్నారు. అననుకూల వాతావరణ కారకాల కారణంగా దిల్లీ-ఎన్​సీఆర్​లో గాలి నాణ్యత క్షీణిస్తోంది. ప్రతి ఏటా అక్టోబర్​లో మొదలై దీపావళికి కాలుష్యం తీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలోనే దిల్లీలో గాలి నాణ్యత సోమవారం గణనీయంగా పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దిగజారింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమాచారం ప్రకారం దిల్లీలోని ఆనంద్ విహార్​లో 'అతితీవ్ర' స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. గురుగ్రామ్, నొయిడా, ఫరీదాబాద్‌లలోనూ గాలి నాణ్యత క్షీణించింది.

'ఐదేళ్లలో కనిష్ఠం'
దీపావళి తర్వాత దిల్లీలో వాయు కాలుష్యం గడిచిన ఐదేళ్లలోనే కనిష్ఠ స్థాయిని నమోదు చేసిందని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. ఈ దీపావళికి గతంతో పోలిస్తే టపాసులు 30 శాతం తక్కువగా కాల్చారని చెప్పారు. టపాసుల విషయంలో ప్రజలకు అవగాహన పెరుగుతోందని అన్నారు. కాగా, ప్రస్తుతం కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 150 స్మోక్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండానే పంజాబ్​ రాష్ట్రం పంట వ్యర్థాల దహనాన్ని నియంత్రించిందని పేర్కొన్నారు.

Last Updated : Oct 25, 2022, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details