తెలంగాణ

telangana

నరహంతక పులి నిర్బంధం- 22 రోజుల వేట అనంతరం..

By

Published : Oct 15, 2021, 6:11 PM IST

తమిళనాడు-నీలగిరి జిల్లాలో ఆపరేషన్‌ టైగర్‌ విజయవంతమైంది. 22 రోజుల గాలింపు ప్రక్రియ తర్వాత మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు నరహంతక టీ-23 పులిని ప్రాణాలతో నిర్బంధించారు. నలుగురు గ్రామస్థులు సహా 20కిపైగా జంతువులను చంపటం వల్ల మసినగుడి ప్రాంతంలో కలకలం రేగింది. అటవీ శాఖాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పులిని బంధించారు.

tiger latest news
పులి వార్తలు

తమిళనాడులోని నీలగిరి జిల్లా మసినగుడి ప్రాంతంలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పులిని అటవీ సిబ్బంది నిర్బంధించారు. 22 రోజులపాటు సాగిన వేట విజయవంతమైంది. మసినగుడి నుంచి తెప్పకాడుకు వెళ్లే మార్గంలో గురువారం రాత్రి ఈ పులి కనిపించింది. అనంతరం శుక్రవారం ఉదయం దీన్ని మోయార్‌, సింగర ప్రాంతంలో గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న అటవీ సిబ్బంది పులికి మత్తునిచ్చి బంధించారు.

టీ-23 పులి

స్థానికుల భయాందోళన..

మదుమలై పులి సంరక్షణ కేంద్రం సమీప ప్రాంతాల్లో కొంతకాలం నుంచి ఈ పులి సంచారం మొదలైంది. దానికి టీ-23గా నామకరణం చేశారు. మసినగుడి ప్రాంతంలో నలుగురు గ్రామస్థులతోపాటు 20కిపైగా జంతువులపై ఇది దాడిచేసి చంపింది. దీంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. చివరగా గొర్రెలకాపరిపై దాడి చేసి చంపటం వల్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతంలో రోడ్లను దిగ్బంధించారు. గ్రామస్థుల ఆందోళనతో స్పందించిన అటవీశాఖ.. పులిని పట్టుకునేందుకు 20 సభ్యులతో 5ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అవసరమైతే పులిని చంపాలని ఆదేశాలు జారీ చేసింది.

నరహంతక పులిని బంధించిన అధికారులు
నిర్బంధంలో పులి

ప్రాణాలతో పట్టుకోండి..

తమిళనాడు అటవీశాఖ ఉత్తర్వులను వ్యతిరేస్తూ.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సంగీతడోగ్రా అనే వన్యప్రాణి సంరక్షురాలు ఈనెల 2న మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పులి మనుషులను వేటాడే మృగమో కాదో శాస్త్రీయంగా రుజువుకాలేదని.. అధికారులు వన్యప్రాణి చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. టీ-23గా పేర్కొంటున్న ఆ పులిని చంపొద్దని మద్రాస్‌ హైకోర్టు.. ఆదేశించింది. ఇతర జంతువులకు ఇబ్బంది కలగకుండా పులిని పట్టుకోవాలని అటవీ శాఖకు సూచించింది. పులిని పట్టుకోవడంపై నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కేవలం పులిని బంధించేందుకు మాత్రమే చర్యలు చేపడుతున్నట్లు తమిళనాడు అటవీ అధికారులు హైకోర్టుకు తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు.. అదనపు బృందాలను రంగంలోకి దించిన అటవీశాఖ.. పులిని ప్రాణాలతో పట్టుకుంది. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి బంధించారు.

పులిని బంధించి తీసుకెళ్తున్న అటవీ అధికారులు

ఇదీ చూడండి:'ఆ పులిని చంపొద్దు.. పట్టుకోండి చాలు'

ABOUT THE AUTHOR

...view details