తెలంగాణ

telangana

ఎన్నికల కమిషనర్లతో పీఎంఓ భేటీ- కాంగ్రెస్ ధ్వజం

By

Published : Dec 17, 2021, 5:34 PM IST

EC interaction with PMO: ఎన్నికల సంఘం కమిషనర్లతో ప్రధాని కార్యాలయం అనధికారిక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న ఎన్నికల సంస్కరణలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. తాజాగా మరోసారి ఎన్నికల కమిషనర్లు ప్రధాని ముఖ్యకార్యదర్శి నిర్వహించే భేటీకి హాజరుకావాలని న్యాయశాఖ లేఖ పంపినట్లు వార్తలొచ్చాయి. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. స్వతంత్ర భారతచరిత్రలో ఇలాంటిదెప్పుడూ వినలేదంటూ విస్మయం వ్యక్తం చేసింది.

EC interaction with PMO, ఎన్నికల కమిషనర్లతో పీఎంఓ సమావేశం
ఎన్నికల కమిషనర్లతో పీఎంఓ సమావేశం

EC meeting with PMO: ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్​ సుశీల్ చంద్రతో పాటు సహచర కమిషనర్లతో ప్రధాని కార్యాలయం అనధికారిక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. కీలక ఎన్నికల సంస్కరణల అవగాహనకు సంబంధించి ఈసీ, న్యాయశాఖ, ఎన్నికల సంఘం మధ్య అంతరాన్ని తగ్గించేందుకే ఈ భేటీ జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఎన్నికల చట్టాలు, ఇతర కీలక సమస్యలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని ఎన్నికల సంఘం చాలా కాలంగా ఒత్తిడి చేస్తోందని, నవంబర్​లో జిరిగిన వర్చువల్​ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. ప్రధాని కార్యాలయమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించాయి. ఈ వ్యవహారానికి సంబంధించి శుక్రవారం వార్తాపత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.

PMO meeting with ECs

అనంతరం కామన్​ ఎలక్టోరల్ రోల్​పై ప్రధాని ముఖ్య కార్యదర్శి నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఎన్నికల సంఘానికి న్యాయశాఖ లేఖ పంపినట్లు తెలుస్తోంది. చీఫ్​ ఎలక్షన్ కమిషనర్​ ఈ భేటీలో పాల్గొనాలని లేఖలో పేర్కొంది. అయితే అధికారిక సమావేశానికి ముగ్గురు కమిషనర్లు హాజరుకాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని ముఖ్య కార్యదర్శి నిర్వహించిన అధికారిక సమావేశానికి ఎన్నికల అధికారులు, న్యాయ శాఖ అధికారులు హాజరైనట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై మాజీ సీఈసీ ఎస్​వై ఖురేషి స్పందించారు. ఇది తనకు షాకింగ్​గా ఉందని వ్యాఖ్యానించారు.

CEC PMO interaction

పీఎంఓతో జరిగిన అనధికారిక భేటీలో ఎన్నికల సంఘం ప్రతిపాదించిన సంస్కరణలకు బుధవారం జరిగిన కేబినెట్​ సమావేశంలో ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే సంబంధిత బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు అధికారిక వర్గాలు చెప్పాయి.

ఎలక్టోరల్ రోల్స్​తో ఆధార్​ను​ స్వచ్ఛందంగా అనుసంధానించడం, అర్హులైన యువతను ఏటా నాలుగు రోజుల్లో ఓటర్లుగా నమోదు చేయడం వంటివి ఈసీ ప్రతిపాదించిన సంస్కరణల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఏటా జనవరి 1న మాత్రమే 18 ఏళ్లు పైబడిన వారిని ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సంస్కరణలు గత 25 ఏళ్లుగా పెండింగ్​లోనే ఉన్నాయి.

ఎన్నికల సంస్కరణల కోసం ఈసీ న్యాయశాఖను కోరడం, వీటికి సంబంధించి స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆ శాఖ ఈసీకి సూచించడం చాలా ఏళ్లుగా జరుగుతోంది. నవంబర్​లో నిర్వహించిన అనధికారిక సమావేశంతో ఈ అంతరాలు తొలగిపోయాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

సాధారణంగా న్యాయశాఖ మంత్రులు, శాసన కార్యదర్శులు నిర్వాచన్​ సదన్‌లో వివిధ సమస్యలపై ఎన్నికల కమిషనర్లను కలుస్తూ ఉంటారు. ఈసీ స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయినందున కమిషనర్లు ప్రోటోకాల్‌లో భాగంగా మంత్రులను ఎప్పుడూ పిలవరు.

Congress on election commission

అయితే ఈసీతో పీఎంఓ సమావేశం నిర్వహించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కూడా కేంద్రప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించింది. రాజ్యాంగ సంస్థలను నాశనం చేయటంలో ప్రభుత్వం రోజురోజుకూ దిగజారుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా విమర్శించారు. ఉమ్మడి ఎలక్టోరల్స్‌ రోల్స్‌పై ప్రధాని ముఖ్యకార్యదర్శి పీకే మిశ్ర నిర్వహించే సమావేశానికి సీఈసీతోపాటు మిగతా ఇద్దరు కమిషనర్లు కూడా హాజరుకావాలని న్యాయశాఖ అధికారులు వర్తమానం పంపటంపై ఈ విధంగా స్పందించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటిదెప్పుడూ వినలేదంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని తన ట్విట్టర్‌ ఖాతాలో ట్యాగ్‌ చేశారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్​ ఎమ్మెల్యే 'అత్యాచారం' వ్యాఖ్యలపై దుమారం

ABOUT THE AUTHOR

...view details