తెలంగాణ

telangana

హోలీ రోజు విషాదం.. వీధి వ్యాపారులపైకి దూసుకెళ్లిన వాహనం.. ఇద్దరు మృతి

By

Published : Mar 9, 2023, 9:09 AM IST

అతివేగంగా వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి వీధి వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరోవైపు, అనుమానాస్పద రీతిలో ముగ్గురు మహిళలు ఇంట్లో శవాలై కనిపించారు. ఈ ఉదంతం ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

delhi-accident
delhi-accident

హోలీ పండగ రోజు దిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ వాహనం.. వీధి వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. వారిలో తీవ్ర గాయాలైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దక్షిణ దిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో ఉన్న మలాయ్ మందిర్ సమీపంలో బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు ఈ ఘటన జరిగింది.

ప్రమాదానికి కారణమైన వాహనం

వేగంగా దూసుకొచ్చిన థార్ వాహనం.. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తోపుడు బండ్లను ఢీకొట్టింది. వాహనం బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. థార్ ఢీకొట్టగానే.. తోపుడు బండ్లు ధ్వంసమయ్యాయి. వాహనం చాలా వేగంతో వచ్చిందని క్షతగాత్రుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొదట ఓ పిల్లర్​ను ఢీకొట్టిందని తెలిపారు. ఆ తర్వాత వాహనం అదుపు తప్పిందని వివరించారు. ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న పండ్లు అమ్మే వారిపైకి దూసుకొచ్చిందని చెప్పారు. ప్రమాదం తర్వాత వాహనం అనేకసార్లు పల్టీలు కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

ప్రమాదానికి కారణమైన వాహనం
ధ్వంసమైన తోపుడు బండి
ధ్వంసమైన కారు

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు అనుమానాస్పద రీతిలో మృతదేహాలై కనిపించడం కలకలం రేపింది. భుజ్​పుర ప్రాంతంలో ఉండే ఆ మహిళలు ఇంట్లోనే శవాలుగా తేలారు. దీంతో స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. వెంటనే పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. వాటిని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ఇస్లాం నగర్​ ప్రాంతంలో ముగ్గురు మహిళలు నివాసం ఉంటున్నారు. వీరు విషపదార్థాలు సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో 50 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తోంది. కుమార్తెల వయసు వరుసగా 20, 22గా ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పూర్తిగా మౌనం వహిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై వారు ఎలాంటి విషయాలు చెప్పడం లేదని స్థానికులు చెబుతున్నారు.

కూతురికి ప్రసవం చేసి..
మరోవైపు, గుజరాత్​లో ఘోరం జరిగింది. కన్నకూతురికి ప్రసవం చేసిన ఓ తండ్రి.. పుట్టిన శిశువును గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత శిశువు తల, మొండెం వేరు చేశాడు. శిశువు శరీర భాగాలను ఓ కాలువలో పడేశాడు. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details