తెలంగాణ

telangana

Dead Policeman Comes Alive : అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. పోస్టుమార్టమ్​కు తరలిస్తుండగా 'బతికిన' పోలీస్​!

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 6:35 PM IST

Updated : Sep 20, 2023, 7:02 PM IST

Dead Policeman Comes Alive In Punjab : పంజాబ్​ రాష్ట్రం లుథియానాలో విచిత్ర సంఘటన జరిగింది. చనిపోయాడనుకొని పోస్ట్​మార్టంకు తరలిస్తున్న ఓ పోలీసు అధికారి మృతదేహంలో కదలికలు రావడం వల్ల ఒక్కసారిగా అందరూ కంగుతిన్నారు. దీంతో అతడిని వేరే ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు.

Dead Policeman Comes Alive In Punjab
Dead Policeman Comes Alive In Punjab

Dead Policeman Comes Alive In Punjab :చనిపోయాడనుకొని పోస్ట్​మార్టమ్​కు తరలిస్తున్న ఓ పోలీసు అధికారి తిరిగి బతికాడు. ఆయన మృతదేహంలో కదలికలను గమనించిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. దీంతో ఆయనను వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి ప్రాణాలు రక్షించారు. ఈ విచిత్ర సంఘటన పంజాబ్​లోని లుథియాలనాలో వెలుగు చూసింది.

ఇదీ జరిగింది
మన్​ప్రీత్​ అనే పోలీసు అధికారి లుథియానాలోని నాయబ్​ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈయన చేతికి ఇటీవలే ఓ విషపూరితమైన పురుగు కుట్టింది. దీంతో ఆయన్ను సెప్టెంబర్​ 15న లుథియానాలోని AIIMC బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. దీని కారణంగా మన్​ప్రీత్​ శరీరమంతా ఇన్​ఫెక్షన్​ సోకింది. దీంతో ఆయనను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినా మన్​ప్రీత్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఇది గమనించిన మన్​ప్రీత్​ తండ్రి ఏఎస్​ఐ రామ్​జీ తన కుమారుడిని వేరే ఆస్పత్రికి రిఫర్​ చేయాల్సిందిగా వైద్యులను కోరారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్​ 18న అర్ధరాత్రి సమయంలో మన్​ప్రీత్​ మృతి చెందాడని ఆస్పత్రి సిబ్బంది రామ్​జీకి చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యం కూడా ఆయన డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం సెప్టెంబర్​ 19న ఉదయం 9 గంటలకు ప్రత్యేక అంబులెన్స్​లో తరలిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఆయన శరీరంలో కదలికలను గుర్తించాడు అక్కడే డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి. ఈ విషయాన్ని మన్​ప్రీత్​ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఇది తెలుసుకున్న వారంతా ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. వెంటనే ఆయనను DMC ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం మన్​ప్రీత్​ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఆసుపత్రి వైద్యుల వెర్షన్​!
మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం, వైద్యుల వాదన భిన్నంగా ఉంది. పేషెంట్​ కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. అయితే ఆసుపత్రిలో చేర్పించేముందు మన్​ప్రీత్​కు విషపూరితమైన పురుగు కుట్టిందని కుటుంబ సభ్యులు తమకు తెలపలేదని.. కేవలం చేయి, కాలులో మాత్రమే గాయమైందని చెప్పారని తెలిపారు. పైగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు బీపీతో బాధపడుతున్నాడు. అలాగే చెయ్యి పూర్తిగా దెబ్బతింది. ఈ కారణంగానే ఆయన ఆరోగ్యం క్షీణించి ఉంటుందని AIIMC బస్సీ ఆసుపత్రి వైద్యులు డా.సాహిల్​ చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల.. బతికే అవకాశాలు లేవని నిర్ధరించుకున్నాకే వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా తాము కోరామని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. ఇందుకోసమే ప్రత్యేక వెంటిలేటర్​పై ఆయనను ఉంచి అంబులెన్స్​లో తరలిస్తున్న సమయంలో శరీరంలోని అవయవాలు కదిలాయని డాక్టర్లు అంటున్నారు. అంతేగానీ మన్​ప్రీత్​ చనిపోయాడని తమ సిబ్బంది ఎవరూ చెప్పలేదని చెబుతున్నారు.

అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు.. ఇంతలోనే!
మన్​ప్రీత్​ చనిపోయాడని తెలుసుకున్న తోటి పోలీసులు, కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పైగా ఆయన అంత్యక్రియలకు అన్నీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మన్​ప్రీత్​ బతికే ఉన్నాడన్న వార్త తెలుసుకున్న అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Last Updated : Sep 20, 2023, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details