తెలంగాణ

telangana

దేశంలో పెరిగిన కరోనా కేసులు.. మూడు డోసులకూ లొంగని కొత్త వేరియంట్‌ వ్యాప్తి!

By

Published : Sep 15, 2022, 9:22 AM IST

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,422 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 5,748 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు, మూడు డోసులకూ లొంగని కొత్త వేరియంట్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కాగా, కొవిడ్ ముగింపు దశకు వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పుకొచ్చింది.

CORONA CASES IN INDIA REPORTS
CORONA CASES IN INDIA REPORTS

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,422 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 34 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,748 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు:4,45,16,479
  • మరణాలు:5,28,250
  • యాక్టివ్ కేసులు: 46,389
  • రికవరీలు:4,39,41,840

Vaccination In India :
దేశంలో బుధవారం 31,09,550కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 215.98 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,14,692 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 520,969 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,466 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 615,324,011 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,522,896 మంది మరణించారు. మరో 640,356 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 5,94,344,187 కు చేరింది.

  • దక్షిణ కొరియాలో కొత్తగా 93,904 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 60మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జపాన్​లో కొత్తగా78,701కేసులు వెలుగుచూశాయి. మరో 191 మంది మరణించారు.
  • జర్మనీలో46,514 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 230 మంది మృతి చెందారు.
  • తైవాన్​లో 49,708 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో 51,735 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 98 మంది మృతి చెందారు.

మూడు డోసులకూ లొంగని వేరియంట్‌:
కొవిడ్‌లో ఒమిక్రాన్‌ బిఎ.4.6 అనే కొత్త ఉపరకం అమెరికా, యూకేలలో విస్తరిస్తోంది. తమ దేశంలో సేకరించిన మొత్తం నమూనాల్లో 3.3% ఈ రకాలే ఉన్నట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ తెలిపింది. అదిప్పుడు 9 శాతానికి చేరింది. అమెరికాలో సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ సైతం దేశవ్యాప్తంగా 9% కేసులు బిఎ.4.6 రకాలేనని తెలిపింది. ఈ రెండు దేశాలే కాక.. ప్రపంచంలోని ఇంకా పలు దేశాల్లోనూ ఈ ఉపరకం కనిపిస్తోంది.

బిఎ.4.6 కూడా బిఎ.4 లాంటిదేనని, అందులోని స్పైక్‌ ప్రోటీన్‌లో ఉత్పరివర్తనం ఉంటుందని తెలిపారు. ఆర్‌346టి అనే ఈ ఉత్పరివర్తనం కొన్ని ఇతర ఉపరకాల్లోనూ కనిపించింది. దానివల్ల, టీకా తీసుకున్నా.. లేదా అంతకుముందు వైరస్‌ సోకినా వచ్చే రోగనిరోధకశక్తి నుంచి ఇది తప్పించుకుంటుంది. ఒమిక్రాన్‌లోని ఇతర రకాల్లాగే దీనివల్ల కూడా వ్యాధి తీవ్రత, మరణాలు సంభవించే అవకాశాలు తక్కువ.

తుదిదశకు కొవిడ్‌: డబ్ల్యూహెచ్‌వో
ప్రపంచాన్ని రెండు మూడేళ్లుగా వేధిస్తున్న కొవిడ్‌-19 ముగింపుదశకు చేరిందని, గత వారం ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాలు 2020 మార్చి నుంచి పోల్చితే కనిష్ఠ స్థాయిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇంకా పూర్తిగా కరోనా ముప్పు తొలగకపోయినా, ఈ మహమ్మారి ముగింపు మటుకు కనుచూపు మేరలోనే ఉందన్నారు.

గత వారం నమోదైన మరణాలను పరిశీలిస్తే.. 22 శాతం తగ్గి, ప్రపంచవ్యాప్తంగా 11,000 మేర నమోదైనట్లు వివరించారు. కొత్త కేసులు 31 లక్షల దాకా ఉన్నాయని, అంతటా వ్యాధి తగ్గుముఖం పడుతోందన్నారు. కొన్ని దేశాల్లో కొవిడ్‌ పరీక్షలు, జాగ్రత్తల విషయంలో ఉదాసీనంగా ఉంటున్నందున కేసులు బయటపడని ఉదంతాలు కూడా ఉన్నట్లు తెలిపారు. శీతాకాలంలో మళ్లీ కేసుల సంఖ్య పెరిగి, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే ఇప్పటిదాకా సాధించిన పురోగతి వృథా అవుతుందని టెడ్రోస్‌ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details