పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్కు, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య విభేదాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్(పీసీసీ) నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. పీసీసీ చీఫ్తో పాటు, ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2022 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. సామాజిక వర్గాల పరంగా అందరినీ సంతృప్తిపరిచేలా పంజాబ్లో కాంగ్రెస్ నాయకత్వం ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటివరకు దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. "అన్ని స్థాయుల్లోనూ కాంగ్రెస్ సంప్రదింపులు జరిపింది. పార్టీ నియామకాల్లో అసమ్మతి నెలకొనేందుకు అవకాశం లేదు" అని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు.
రాహుల్తో రావత్ భేటీ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీశ్ రావత్ సమావేశం బుధవారం జరగాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాల వల్ల రాహుల్ గాంధీ ఈ భేటీకి హాజరు కాలేదు. "రాహుల్ గాంధీ మరో సమావేశంలో పాల్గొన్నందున నాతో భేటీకి వీలు కాలేదు. రేపు మరోసారి ఈ సమావేశం నిర్వహించాలని ఆయన్ను నేను కోరాను. పంజాబ్ అంశంపై ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని హరీశ్ రావత్ విలేకరులతో బుధవారం చెప్పారు. పీసీసీ చీఫ్ పదవిలో సిద్ధూని నియమిస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. అది తన చేతుల్లో లేదని చెప్పారు.