తెలంగాణ

telangana

'న్యాయవాద వృత్తిని వ్యాపారంగా చూడొద్దు'

By

Published : Dec 10, 2021, 7:13 AM IST

CJI NV Ramana on law course: న్యాయవాద వృత్తి చాలా గొప్పదని.. విద్యార్థులు వ్యాపారంగా చూడొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. లాభార్జన కోసం ఈ వృత్తిని ఉపయోగించొద్దని హితవు పలికారు. మరోవైపు గదుల్లోనే చిన్నారుల ప్రతిభ ఆవిరైపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

cji nv ramana latest news
cji nv ramana latest news

CJI NV Ramana on law course: విద్యార్థులు న్యాయవాద వృత్తిని కేవలం వృత్తిగా చూడాలి తప్పిస్తే దాన్నో వ్యాపారంగా చూడొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. లాభార్జన కోసం ఈ వృత్తిని ఉపయోగించొద్దని హితవు పలికారు. గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థుల నుంచి గొప్ప నాయకులు పుట్టుకు రావడంలేదన్నారు. గురువారం ఇక్కడ జరిగిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (నేషనల్‌ లా యూనివర్శిటీ) 8వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని కీలకోపన్యాసం చేశారు.

"న్యాయ వృత్తి చాలా గొప్పది. నిరంతరం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకున్న పౌరులు ప్రజాస్వామ్య సమాజానికి గొప్ప ఆస్తి. ఆధునిక ప్రజాస్వామ్యంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని తక్కువ చేయకూడదు. విద్యార్థులు నాయకుల్లా అవతరించాలి. జాతి ఆలోచనలను ప్రభావితం చేసే సంకుచిత, విభజనకారక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వొద్దు. సాధారణ పాఠశాల, కాలేజీ విద్యకు తోడు చుట్టూ ఉన్న వాతావరణం మా తరానికి ఎన్నో విలువైన విషయాలు నేర్పింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు వృత్తి విద్యా కోర్సులపై పూర్తి నిర్లక్ష్యం నెలకొంది. ముక్కుపచ్చలారని వయసులో చిన్నారుల ప్రతిభ అంతా ఊపిరాడని వాతావరణంలో, జైళ్లను తలపించే గదుల్లో ఆవిరైపోతోంది" అని జస్టిస్‌ రమణ ఆవేదన వ్యక్తం చేశారు.

నాణ్యమైన న్యాయవిద్య సాధ్యమవుతోందా?

"విద్యార్థులు వృత్తివిద్య విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా బయటి ప్రపంచంలోని అంశాలపై దృష్టి సారించడంలేదు. దేశంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం.. నాణ్యమైన న్యాయవిద్యను అందుబాటులోకి తేవడమే. వాస్తవంగా అది సాధ్యమవుతోందా అనే అధ్యయనం మాత్రం నిర్వహించలేదు. విభిన్న కారణాలవల్ల ఈ యూనివర్శిటీల్లో చదువుతున్న చాలామంది విద్యార్థులు కార్పొరేట్‌ లా సంస్థల్లో చేరిపోతున్నారు. వారితో పోలిస్తే న్యాయవాద వృత్తిలో ఉన్న వారు సమాజంలోని విభిన్న వర్గాలతో మాట్లాడుతుంటారు. దానివల్ల విస్తృత అవగాహన ఏర్పడుతుంది. సామాజిక అంశాలపై కోర్టుల్లో పోరాడే శక్తి వస్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ వాస్తవాలకు దూరంగా న్యాయవాదులు ఉండకూడదు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. చట్టాల అమలులో న్యాయవ్యవస్థ స్వతంత్రత అన్నింటి కంటే సర్వోన్నతం అన్నది గుర్తుంచుకోవాలి" అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే రైతు సంఘాన్ని వీడాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details