తెలంగాణ

telangana

ఒడిశా రైలు ప్రమాదం దర్యాప్తులో ట్విస్ట్.. జేఈ అమీర్​ ఖాన్​ ఇంటికి సీల్.. అంతా అక్కడే..

By

Published : Jun 20, 2023, 4:47 PM IST

CBI Odisha train accident : ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాదంపై సీబీఐ చేస్తున్న దర్యాప్తు.. కీలక మలుపు తిరిగింది. కేసు విచారణలో భాగంగా బాలేశ్వర్ సిగ్నల్‌ జేఈ అమీర్‌ ఖాన్‌ ఇంటికి సీబీఐ సీల్‌ వేయడం, అతడిని సుదీర్ఘంగా విచారించడం కలకలం రేపుతోంది. దర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలతో బాలేశ్వర్ రైలు ప్రమాదం వెనక కుట్ర ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

cbi-odisha-train-accident
cbi-odisha-train-accident

CBI Odisha train accident : ఒడిశాలో 292 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్న బాలేశ్వర్ రైలు ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) చేస్తున్న దర్యాప్తులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్‌ఖాన్ అద్దె ఇంటికి సోమవారం సీల్‌ వేసిన సీబీఐ అధికారులు.. మంగళవారం అతని సమక్షంలోనే ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంతకుముందు అమీర్‌ ఖాన్‌ను రహస్య ప్రాంతానికి తరలించి సుదీర్ఘంగా విచారించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను తారుమారు చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాలేశ్వర్ రైలు ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంపై జూన్ 6న సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అప్పటి నుంచి జరుగుతున్న దర్యాప్తు.. జేఈ అమీర్‌ ఖాన్‌ ఇంటికి సీల్‌ వేసిన నేపథ్యంలో కీలక మలుపు తిరిగింది.

జూన్‌ 2వ తేదీ రాత్రి బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. సీబీఐ రంగంలోకి దిగింది. జేఈ అమీర్‌ ఖాన్‌ కదలికలపై నిఘా ఉంచింది. విచారణ చేపట్టిన తొలినాళ్లలోనే సిగ్నల్‌ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అమీర్‌ ఖాన్‌ ఇంటికి సీల్‌ వేసిన తర్వాత సీబీఐ అధికారుల బృందం.. సోరోలోని తెంటెయ్‌ ఛక్‌లో ఉన్న బాహానగా స్టేషన్‌ మాస్టర్‌ ఇంటిని సైతం పరిశీలించింది. జూన్ 16న బాలేశ్వర్​లో పలువురిని విచారించిన సీబీఐ అధికారులు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

వారి పనే కీలకం..
CBI Odisha accident : రైల్వేలో జూనియర్‌ సిగ్నల్‌ ఇంజినీర్‌.. పాయింట్ మెషీన్లు, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లు, సిగ్నల్‌లతో సహా సిగ్నలింగ్ పరికరాల ఇన్‌స్టాలేషన్, నిర్వహణ, మరమ్మతు విధులను నిర్వహిస్తారు. రైలు సేవలను సాఫీగా, సురక్షితంగా నిర్వహించడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతటి కీలకమైన విధుల్లో ఉన్న జేఈ అమీర్‌ ఖాన్‌ ఇంటిని సీబీఐ అధికారులు సీల్‌ చేయడం ఆసక్తి రేపుతోంది.

మాటలకు అందని ఘోర విషాదం..
బాలేశ్వర్​లో షాలిమార్- చెన్నై కోరమాండల్ రైలు.. ఆగి ఉన్న గూడ్స్​ను ఢీకొట్టగా పెను ప్రమాదం జరిగింది. గూడ్స్​ను అతివేగంగా ఢీకొట్టిన తర్వాత కోరమాండల్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ బోగీలను బెంగళూరు- హవ్​డా సూపర్​ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ ఢీకొట్టగా.. ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details