తెలంగాణ

telangana

RBI ఎఫెక్ట్!​.. రూ.2000 నోట్లతో రూ.4 లక్షల ట్యాక్స్​ కట్టిన బస్​ ఓనర్

By

Published : May 21, 2023, 9:58 PM IST

Updated : May 21, 2023, 10:20 PM IST

Bus Operator Paid Tax Of 4 Lakh Rupees With 2 Thousand Notes In Gujarat Surat District
ఆర్​బీఐ ఎఫెక్ట్​.. రూ.2000 నోట్లతో 4 లక్షల ట్యాక్స్​ కట్టిన బస్​ ఓనర్​.. ఎక్కడో తెలుసా..? ()

ఓ బస్సు యజమాని​ తన వాహనంపై కట్టాల్సిన లక్షల రూపాయల ట్యాక్స్​ను దాదాపు రూ.2 వేల నోట్లతోనే కట్టాడు. ఆర్​బీఐ రూ.2వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన తర్వాత రోజే అతడు దీనిని చెల్లించాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?

రూ.2000 నోట్ల ఉపసంహరించుకున్నట్లు ఆర్​బీఐ ప్రకటించిన నేపథ్యంలో కొందరు తమ దగ్గరున్న ఈ నోట్లను వదిలించుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ క్రమంలో గుజరాత్​లోని సూరత్​ జిల్లాకు చెందిన ఓ బస్సు ఓనర్​ ఏకంగా తన వాహనంపై ఉన్న రూ.6 లక్షల ట్యాక్స్​లో రూ.4 లక్షల​ను కట్టేందుకు రూ.2 వేల నోట్లను వినియోగించాడు. దేశంలో చలామణీలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్నట్లు మే 19న ఆర్​బీఐ ప్రకటించిన తర్వాత రోజే ఈ సంఘటన జరగడం గమనార్హం.

కొంతకాలం క్రితం.. ఆర్​టీఏ తనిఖీల సమయంలో రాజ్‌కోట్​కు చెందిన బస్సు ఆపరేటర్ సొంత​ వాహనంపై ఒక ఏడాదికి సంబంధించి పన్ను బకాయి ఉందని గుర్తించారు అధికారులు. దీంతో బస్సును ఆర్​టీఏ కార్యాలయానికి తీసుకొచ్చి షెడ్​లో ఉంచారు. మొత్తం ట్యాక్స్​ను కట్టిన తర్వాతే బస్సును తిరిగి తీసుకెళ్లాలని అధికారులు తేల్చి చెప్పారు. అయినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. అయితే రెండ్రోజుల క్రితమే రూ.2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం వచ్చిన మరుసటి రోజే అతడు రూ.2వేల నోట్లతో ట్యాక్స్​ చెల్లించాడు.

"తాజాగా సూరత్​లోని ఆర్​టీఏ కార్యాలయానికి ఓ లగ్జరీ బస్సు యజమాని​ వచ్చాడు. అతడి వాహనంపై ఏకంగా రూ.6 లక్షల వరకు పన్ను బాకీ ఉంది. ఇందులో రూ.4 లక్షలను మొత్తం రూ.2 వేల నోట్లతోనే చెల్లించాడు. మిగతా రెండు లక్షలను రూ.100, రూ.500ల నోట్లతో చెల్లించాడు" అని అధికారి తెలిపారు.

'అనంతకోటి ఉపాయాలు'!
'శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు' అన్నట్లుగా రూ.2000 నోట్ల విత్​డ్రా విషయంలో ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయంతో వాటిని వదిలించుకునేందుకు అనేక మార్గాలను ప్రజలు అన్వేషిస్తున్నారు! దీనికి సామాన్యులు సైతం అతీతులు కారు. ఇప్పటికే కొందరు తమ దగ్గరున్న రూ.2000 నోట్లను పెద్ద మొత్తంలో షాపింగ్​కు వినియోగిస్తుండగా.. మరికొందరు సూపర్​ మార్కెట్​లు, కిరాణా దుకాణాల్లో కొనుగోళ్లకు ఎక్కువగా ఈ నోట్లనే తీసుకెళ్తున్నారట. మరోవైపు పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్​, డీజిల్​​ కోసం వాహనదారుల్లో ఎక్కువమంది ఈ నోట్లనే తెస్తున్నారట. ఈ ఉపసంహరణ నిర్ణయం కారణంగా ఇప్పటికే ఆన్​లైన్​ చెల్లింపులు కూడా క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ ఆన్​లైన్​లో క్రయవిక్రయాలు జరిపే వారు కూడా రూ.2000 నోట్లను ఎక్కువగా వాడుతున్నారు.

పెరిగిన రైల్వే టికెట్ల అమ్మకాలు!
రూ.2 వేల నోట్ల ప్రభావం సూరత్ రైల్వే స్టేషన్‌లోని టికెట్​ రిజర్వేషన్​ కౌంటర్‌లోనూ స్పష్టంగా కనిపించింది. రోజూవారీ టికెట్ల అమ్మకాల కంటే కూడా ఇక్కడ రెట్టంపు స్థాయిలో టిక్కెట్లు విక్రయాలు జరిగాయి. సాధారణంగా రోజూ 2000 నుంచి 2500 వరకు టిక్కెట్లు అమ్మే అధికారులు.. శనివారం ఏకంగా 5 వేలకు పైగా రిజర్వేషన్​ టిక్కెట్లను విక్రయించారు. అది కూడా చాలా మంది రూ.2000 నోట్లను ఇచ్చి టిక్కెట్లను కొనుగోలు చేశారు.

అయితే రూ.2వేల నోటు డిపాజిట్​/మార్పిడికి సంబంధించి అటు సామాన్యులతో పాటు ఇటు సంపన్నులోనూ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో దేశీయ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) తాజాగా కొన్ని మార్గదర్శకాలనూ విడుదల చేసింది. మరి ఆ రూల్స్​ ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated :May 21, 2023, 10:20 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details