తెలంగాణ

telangana

బూస్టర్​ డోస్ అవసరమా? భారత్​లో ఎప్పుడు?.. కేంద్రం జవాబులివే..

By

Published : Dec 14, 2021, 2:13 PM IST

India booster dose news: బూస్టర్​ డోసుల ఆవశ్యకతకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. బూస్టర్​ డోసు పంపిణీపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని.. దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్​లో పేర్కొంది.

booster dose in india news
'అసలు బూస్టర్​ డోసుల అవసరం ఉందా? భారత్​లో ఎప్పుడు?'

Booster dose in India news: దేశంలో కొవిడ్​ బూస్టర్​ డోసుల ఆవశ్యకతపై.. ఎన్​టీఏఐజీ(నేషనల్​ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ ఆఫ్​ ఇమ్యునైజేషన్​)- ఎన్ఈజీవీఏసీ(నేషనల్​ ఎక్స్​పర్ట్​ గ్రూప్​ ఆన్​ వ్యాక్సిన్​ అడ్మినిస్ట్రేషన్​ ఫర్​ కొవిడ్​)​ శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తున్నాయని దిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. కరోనా టీకా డోసుల షెడ్యూల్​పైనా చర్చలు జరుపుతున్నాయని.. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో పేర్కొంది.

జాతీయ స్థాయిలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేందుకు ఎన్​టీఏజీఐ, ఎన్​ఈజీవీఏసీ విలువైన మార్గనిర్దేశాలను అందిస్తున్నట్టు కోర్టుకు వెల్లడించింది కేంద్రం. టీకా వేసుకుంటే శరీరంలో ఏర్పడే రోగనిరోధక శక్తి ఎంత కాలం ఉంటుందనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదని చెప్పిన కేంద్రం.. రోజులు గడుస్తున్న కొద్దీ మెరుగైన డేటా లభించే అవకాశముందని పేర్కొంది. సార్స్​-కొవ్​-2 వైరస్​ లక్షణాలపై ఇంకా పూర్తి సమాచారం లేదని, అలాంటప్పుడు.. బూస్టర్​ డోసు పంపిణీపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని స్పష్టం చేసింది. అర్హులైన వారందరికీ టీకా రెండు డోసులు పంపిణీ చేయడమే ప్రస్తుతం తమ లక్ష్యం అని.. బూస్టర్​ డోసుపై ఆయా సంస్థలు ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని తెలిపింది.

పాశ్చాత్య దేశాల్లో బూస్టర్​ డోసు పంపిణీ జోరందుకుంటున్న తరుణంలో.. భారత్​లో ప్రస్తుత పరిస్థితులను వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది దిల్లీ హైకోర్టు. కొవిడ్​కు బూస్టర్​ డోసు అవసరమా? అవసరమే అయితే.. ఎప్పటిలోగా బూస్టర్​ డోసులు అందుబాటులో ఉంటాయి? అన్న ప్రశ్నలకు సమాధానంగా అఫిడవిట్​ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బూస్టర్​ డోసుల గురించి వివరించింది కేంద్రం.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details