తెలంగాణ

telangana

రాకాసి గాలులు, భారీ వర్షాలు.. బిపోర్​జాయ్ బీభత్సం​.. అనేక ఇళ్లు ధ్వంసం!

By

Published : Jun 15, 2023, 10:59 PM IST

cyclone biporjoy Landfall : అత్యంత తీవ్ర తుఫాన్​ బిపోర్‌జాయ్.. గుజరాత్‌ తీరాన్నితాకే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ముగియటానికి 5 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో గుజరాత్‌ తీరంలోని 8జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు గంటకు 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. భారీ విధ్వంసం సృష్టిస్తుందన్న హెచ్చరికలతో.. 94వేలకుపైగా మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు.

Cyclone Biporjoy Current Status
Cyclone Biporjoy Current Status

Cyclone Biporjoy Current Status : అత్యంత తీవ్ర తుఫాన్​ బిపోర్‌జాయ్‌.. కచ్‌ జిల్లా జఖౌ ఓడరేవు సమీపంలో తీరం దాటే ప్రక్రియ మొదలైంది. దట్టమైన మేఘాలు.. కచ్‌, సౌరాష్ట్ర జిల్లాల్లో ప్రవేశించటం వల్ల.. తుఫాన్​ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లుగా కేంద్ర వాతావరణ విభాగం చీఫ్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఈ ప్రక్రియ గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని చెప్పారు. బిపోర్‌జాయ్‌ తుఫాన్​ కన్ను వ్యాసార్థం 50కిలోమీటర్లు ఉన్నట్లు తెలిపారు. 13 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో తుఫాన్​ తీరం వైపు పయనిస్తున్నట్లు మహాపాత్ర వివరించారు. తుఫాన్​ కన్ను పూర్తిగా తీరం దాటే వరకు దాదాపు 5గంటలు పడుతుందన్నారు. కచ్‌ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో.. మాండ్వి పాకిస్థాన్​లోని కరాచీ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్​ ప్రభావంతో.. ఆయాప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు గంటకు 115కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు రెండుమూడు మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి.

తుఫాన్​ ధాటికి నేలకొరిగిన చెట్లు

బిపోర్‌ జాయ్‌ తుఫాన్​ బీభత్సం సృష్టిస్తోంది. దేవభూమి జిల్లాలో వృక్షాలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. కచ్‌ జిల్లాలోని జఖౌ, మాండ్వి పట్టణాల్లో అనేక చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రాకాసి గాలుల బీభత్సానికి అమ్రేలిలోని మోరంగిలో 100 ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ పైకప్పులు పడడం వల్ల పలువురు గాయపడ్డారు. వివిధ ప్రాంతాల్లో నేలకూలిన చెట్లు, విద్యుత్తు స్తంభాలను.. తొలగించేపనిలో గుజరాత్‌ పోలీసులు, NDRF, సైన్యం.. నిమగ్నమయ్యాయి. ద్వారక, ఒఖా, నాలియా, భుజ్‌, పోరుబందర్‌, కాండ్లసహా తీరానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఎగిరిపడ్డ ఇంటి పైకప్పు

Cyclone In Gujarat : తుఫాన్​ భారీ విధ్వంసం సృష్టించనుందన్న సమాచారంతో.. సముద్ర తీర ప్రాంతం కలిగిన 8 జిల్లాల్లోని 94,427 మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. కచ్‌ జిల్లాలో 46,800 మందిని, దేవభూమి ద్వారకలో 10,749 మందిని, జామ్‌నగర్‌లో 9,942 మందిని, మోర్బీలో 9,243 మందిని, రాజ్‌కోట్‌లో 6,822 మందిని, జునాగఢ్‌లో 4,864 మందిని, పోరుబందర్‌లో 4,379 మందిని, గిర్‌ సోమనాథ్‌ జిల్లాలో ఒక 1,605 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిలో 8,900 మంది చిన్నారులు, 1031 మంది గర్భిణులు, 4,697 మంది వృద్ధులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎనిమిది జిల్లాల్లోని తుఫాన్​ ప్రభావిత ప్రజల కోసం ఒక వెయ్యి 5 వందల 21 శిబిరాలను ఏర్పాటు చేశారు.

తుఫాన్​ ధాటికి నేలకొరిగిన చెట్లు
భారీ వర్షాలు

Biporjoy Safety Measures : అత్యంత తీవ్ర బిపోర్‌జాయ్‌ తుఫాన్​ భారీ విధ్వంసం సృష్టించనుందన్న సమాచారం మేరకు.. 18 NDRF, 12 SDRF, రోడ్లు, భవనాలు, తాగునీరు, విద్యుత్తు విభాగాలతోపాటు సైన్యం, నౌకాదళం, వాయుసేన, తీరప్రాంత గస్తీ దళం, BSF బృందాలు తుఫాన్​ ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. మరో 15 NDRF బృందాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు NDRF చీఫ్‌ తెలిపారు. గుజరాత్‌, మహారాష్ట్రల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం 33 బృందాలు పనిచేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details