తెలంగాణ

telangana

మోదీ గుజరాత్​ టూర్​.. గాంధీనగర్​ టూ ఐక్యతా విగ్రహం

By

Published : Oct 30, 2020, 9:06 PM IST

Updated : Oct 30, 2020, 9:45 PM IST

కరోనా విజృంభణ తర్వాత తొలిసారి స్వరాష్ట్రంలో పర్యటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. శుక్రవారం గుజరాత్​ వెళ్లిన ఆయన.. కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య వనాన్ని సందర్శించారు. అనంతరం చిల్డ్రన్‌ న్యూట్రిషన్‌ పార్క్‌, ఏక్తా మాల్‌, సర్దార్​ సరోవర్​ డ్యామ్​ వద్ద డైనమిక్​ డ్యామ్​ లైటింగ్​ను ప్రారంభించారు.

modi latest news
మోదీ గుజరాత్​ టూర్​... గాంధీనగర్​ టూ ఐక్యతా విగ్రహం

మోదీ గుజరాత్ తొలిరోజు పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. కొవిడ్‌ విజృంభణ తర్వాత తొలిసారిగా సొంత రాష్ట్రానికి వెళ్లిన మోదీ.. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తొలి పర్యటన ఇలా..

ఈరోజు ఉదయం అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, గవర్నర్‌ ఆచార్య దేవ్రత్‌ సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి గాంధీనగర్‌ వెళ్లిన ప్రధాని.. దివంగత గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్‌ పటేల్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుంచి నర్మదా జిల్లా కేవడియా గ్రామానికి చేరుకున్నారు. ఐక్యతా విగ్రహం సమీపంలో 17 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య వనాన్ని మోదీ ప్రారంభించారు. గోల్ఫ్‌ కార్ట్‌లో ప్రయాణించి ఆరోగ్య వనం అందాలను వీక్షించారు.

ఆ తర్వాత చిల్డ్రన్‌ న్యూట్రిషన్‌ పార్క్‌ను ప్రారంభించి.. అక్కడి న్యూట్రీ రైలులో కాసేపు సరదాగా ప్రయాణించారు. భారత సంస్కృతి సంప్రదాయాలు, చేనేత కళలకు అద్దం పట్టే ఏక్తా మాల్‌ను ప్రారంభించి అక్కడి కళాకృతులను వీక్షించారు.

లైటింగ్​ అదుర్స్​...

నర్మదా జిల్లా కేవడియాలోనే సర్దార్​ పటేల్ జంతుప్రదర్శన శాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అనంతరం జూపార్క్​లో కాసేపు విహరించారు. అనంతరం 'ఎక్తా క్రూజ్​'- ఫెర్రీ బోటులో ప్రయాణించారు. శ్రేష్ఠ భారత్​ భవన్​ నుంచి ఐక్యత విగ్రహం వరకు నదిలో ప్రయాణించారు.

సర్దార్​ సరోవర్​ డ్యామ్​ వద్ద డైనమిక్​ డ్యామ్​ లైటింగ్​ను ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన రంగురంగుల ఎల్​ఈడీ విద్యుత్​కాంతులు​ ఆకట్టుకున్నాయి. అనంతరం కేవడియాలోని యూనిటీ గ్లో గార్డెన్​ను సందర్శించిన మోదీ.. ఐక్యరాజ్య సమితి గుర్తించిన అధికారిక భాషల్లో ఐక్యతా విగ్రహ వెబ్​సైట్​ను, కేవడియా మొబైల్​ యాప్​ను ఆవిష్కరించారు. ఆ తర్వాత యూనిటీ గ్లో గార్డెన్​, కాక్టస్​ గార్డెన్​లో పర్యటించిన మోదీ.. చివరిగా ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు.

ఇవీ చూడండి:

Last Updated :Oct 30, 2020, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details