తెలంగాణ

telangana

బజరంగ్ దళ్ కార్యకర్త హత్య.. గంగా నదిలో బోటు బోల్తా.. ఏడుగురు మృతి

By

Published : Oct 16, 2022, 6:37 PM IST

దిల్లీలో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు బజరంగ్ దళ్ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. అక్టోబరు 12న జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బజరంగ్ దళ్ కార్యకర్త చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు, గంగానదిలో బోటు బోల్తా కొట్టిన ఘటనలో ఏడుగురు మరణించారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

bajrang dal activist killed
బజరంగ్ దళ్ కార్యకర్త హత్య

దిల్లీలోని షాదీపుర్​లో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు.. బజరంగ్ దళ్​ కార్యకర్త నితేశ్​పై దాడి చేశారు. అక్టోబర్ 12న ఈ ఘటన జరగగా.. అప్పటి నుంచి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు నితేశ్ ఆదివారం మరణించాడు. ఈ ఘటనపై రంజిత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులపై ఆరోపణలు చేశారు.

ఇదీ జరిగింది..అక్టోబర్ 12వ తేదీ రాత్రి 9 గంటలకు నితేశ్ అతని స్నేహితులతో కలిసి వస్తుండగా.. ఓ వర్గానికి చెందిన కొందరు యువకులు వీరిని అసభ్యకరంగా దూషించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే వేరే వర్గానికి చెందిన వ్యక్తులు గుమిగూడి నితేశ్, అతని స్నేహితులపై కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో నితేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

గంగా నదిలో బోటు బోల్తా..
బిహార్​ కటిహార్​లోని గంగానదిలో బోటు బోల్తా కొట్టిన ఘటనలో ఏడుగురు మరణించారు. ప్రమాద సమయంలో బోటులో 10 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా వ్యవసాయ కూలీలేనని తెలిపారు. ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు కలిసి మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు, ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను రూ.4 లక్షలు ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

మత్తు మందు ఇచ్చి..
మధ్యప్రదేశ్ షియోపుర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళకు టీలో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అనంతరం బాధితురాలి తలపై రాయితో దాడి చేశాడు.. పొలంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు స్పృహలోకి వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ప్రస్తుతం నిందితుడు కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడు.

దీపావళి సామాను కొనేందుకు బాధితురాలు షియోపుర్ మార్కెట్​కు వెళ్లింది. అక్కడ నిందితుడు ఆమెకు పరిచయమయ్యాడు. అనంతరం టీలో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని కపిల్ రావుగా పోలీసులు గుర్తించారు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేల రివార్డును ప్రకటించారు పోలీసులు.

మట్టి దిబ్బలు కూలి..
ఝార్ఖండ్​ ఛత్రా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మట్టి దిబ్బలు కూలి చిన్నారి సహా నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఛఠ్ పూజ నేపథ్యంలో మట్టిని తీసుకురావడానికి ఐదుగురు మహిళలు, ఓ బాలిక బయటకు వెళ్లారు వెళ్లారు. ఓ చోట మట్టిని తీస్తుండగా వీరిపై దిబ్బలు కూలాయి. ఈ క్రమంలో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మట్టిలో కూరుకుపోయిన వారిని ఆస్పత్రికి తరలించారు.

మట్టిదిబ్బలు తొలగిస్తున్న జేసీబీ

నటిపై క్యాబ్​ డ్రైవర్ వేధింపులు..
మహారాష్ట్ర ముంబైలో ఓ క్యాబ్ డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి, దర్శకురాలు మానవ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్యాక్సీలో ఇంటికి వెళ్తుండగా ఉబర్ డ్రైవర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. ఆమె తనపై జరిగిన దాడి గురించి ఫేస్​బుక్​లో ఖాతాలో పోస్ట్ చేశారు. ఆమె పలు మరాఠీ, హిందీ సినిమాల్లో నటించారు. నిందితుడిపై త్వరలో చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

నటి మానవ నాయక్

ఇవీ చదవండి:రాహుల్ పాదయాత్రలో అపశ్రుతి.. జెండాలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి..

ఖర్గే X థరూర్​.. సోమవారమే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. గెలుపెవరిది?

ABOUT THE AUTHOR

...view details