తెలంగాణ

telangana

'ఛాయ్'​ కోసం ఉరితీశారు.. ఆ అసూయతోనే..!

By

Published : Jun 4, 2022, 8:10 AM IST

Azadi Ka Amrit Mahotsav: నమ్మి చాయ్‌ వ్యాపారం చూపించిన ఆయనే.. నమ్మక ద్రోహం చూసి తిరుగుబాటు జెండా ఎత్తారు. భారతీయులను అణగదొక్కాలనుకున్న ఆంగ్లేయులను ఆర్థికంగా దెబ్బతీయాలనుకున్నారు. తొలి తేయాకు కంపెనీ పెట్టారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో భాగమయ్యారు. ఓర్వలేని బ్రిటిషర్లు ఏకంగా ఉరికంబమెక్కించారు.. తెల్లవారి కుటిలనీతికి బలైన తొలితరం భారత మేధావి దీవాన్‌ మణిరామ్‌ దత్త బారువా!

Azadi Ka Amrit Mahotsav
Azadi Ka Amrit Mahotsav

Azadi Ka Amrit Mahotsav Maniram: మణిరామ్‌ కుటుంబం అసోంలోని అహోం రాజాస్థానంలో కీలక పదవులు నిర్వహించేది. 1817 తర్వాత బర్మా దాడితో అహోం సామ్రాజ్యం కూలిపోయింది. తర్వాత బర్మా నుంచి ఆంగ్లేయులు వశం చేసుకున్నారు. ఆ సమయంలో మణిరామ్‌, ఆయన కుటుంబ సభ్యులు ఈస్టిండియా కంపెనీకి సహకరించారు. 1806లో జన్మించిన మణిరామ్‌ను అస్సాంలోని రంగపూర్‌ ప్రాంత తహసీల్డార్‌గా నియమించారు తెల్లవారు. అప్పటికి ఆయన వయసు 22 సంవత్సరాలే. తనకు అప్పగించిన ప్రాంతాలన్నింటినీ క్షేత్ర పరిశీలన చేస్తూ.. ప్రజల బాగోగులు చూసేవారాయన.

ఈ క్రమంలో.. అసోం ఎగువ ప్రాంతంలోని సింగ్‌ఫో తెగవారు.. తేయాకు పండిస్తూ.. దాన్నుంచి ద్రావణం (టీ-చాయ్‌) తయారు చేసి తాగటం గమనించారు. ఆ సమయానికి.. ఆంగ్లేయులు తేయాకు కోసం చైనాపై ఆధారపడేవారు. వారితో యుద్ధాలు కూడా చేశారు. తేయాకు ఉత్పత్తిలో చైనా ఏకఛత్రాధిపత్యం ఉండేది. ఈ నేపథ్యంలో.. అసోం తేయాకు పంటకున్న అవకాశాల గురించి, స్థానిక ఆదివాసీ తెగల్లో అప్పటికే టీ తయారీ గురించి మణిరామ్‌ తనపై ఆంగ్లేయ అధికారికి వివరించారు. ఆశ్చర్యపోయిన ఆ అధికారి.. స్వయంగా ఆదివాసీ గ్రామాన్ని సందర్శించాడు. అక్కడ వారు పండిస్తున్న తేయాకును, చాయ్‌ తయారీ పద్ధతిని తెలుసుకొని.. వాటి నమూనాలను కలకత్తాకు పంపించారు. నాణ్యత అద్భుతం అని ఫలితం రావటంతో.. ఆంగ్లేయులు ఎగిరి గంతేశారు. 1834లో అస్సాంలో తేయాకు వాణిజ్యానికి తెరదీశారు. కంపెనీలు, ఎస్టేట్‌లు ఆరంభించారు. ఈస్టిండియా కంపెనీ తేయాకు ఎస్టేట్‌కు మణిరామ్‌ను దీవాన్‌గా నియమించారు.

క్రమక్రమంగా ఆంగ్లేయుల వ్యాపార ఎత్తుగడలు, వ్యూహాలు మణిరామ్‌కు అర్థం కావటం మొదలయ్యాయి. స్థానికులను కాదని బయటి రాష్ట్రాల వారిని తీసుకొచ్చి తేయాకు తోటల్లో కొలువులివ్వటం; స్థానికుల స్థలాలు లాక్కొని వెళ్లగొట్టడం.. పన్నులు భారీగా విధించటం.. ఇవన్నీ మణిరామ్‌లో ఆగ్రహం కలిగించాయి. దీవాన్‌ పదవికి రాజీనామా చేసి సొంతంగా జొర్హాట్‌లో తేయాకు సాగు ఆరంభించారు. మరికొన్ని ప్రాంతాలకు విస్తరించటంతో పాటు అస్సాం వాసులనూ ప్రోత్సహించారు. క్రమశిక్షణతో వారు చేస్తున్న వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగింది. ఆంగ్లేయులతో పోటీగా.. లండన్‌ ఎగ్జిబిషన్‌కు తమ ఉత్పత్తులనూ మణిరామ్‌ పంపించారు.

ఆంగ్లేయులు పండించిన వాటిని కాదని.. ఆయన తేయాకుకు స్వర్ణ పతకం లభించింది. ఇది తెల్లవారిలో అసూయ నింపింది. దీనికి తోడు.. పడవల తయారీ, చేతి ఉత్పత్తులు తదితర మరికొన్ని వ్యాపారాల్లోకీ మణిరామ్‌ దిగటంతో బ్రిటిషర్లు తట్టుకోలేకపోయారు. తమతో పోటీ పడుతున్న ఆయన్ను కట్టడి చేయటానికి నడుం బిగించారు. 1850కల్లా ఆంగ్లేయుల దాడి మొదలైంది. యూరోపియన్లకు పోటీ వస్తున్నాడంటూ.. ఆయన తేయాకు తోటలపై ఆంక్షలు విధించారు. కుటుంబాన్ని ఆర్థికంగా వేధించటం మొదలెట్టారు. వీటిపై 1852లో ఆయన కలకత్తా కోర్టును ఆశ్రయించినా లాభం లేకపోయింది.

ఆ తిరుగుబాటుతోపాటే..
ఆంగ్లేయుల స్థానంలో మళ్లీ అసోం అహోం పాలన పునరుద్ధరించాలని మణిరామ్‌ భావించారు. కలకత్తా చేరి పలువురు ప్రముఖులతో సంప్రదింపులు జరిపారు. అహోం రాజ వారసుడు కందర్‌పేశ్వర్‌ సింఘానూ కలిశారు. అదే సమయానికి.. దేశంలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మొదలైంది. ఇదే అదనుగా.. అస్సాంలోని దిబ్రూగఢ్‌, గోలాఘాట్‌ సిపాయిలతో కలసి తిరుగుబాటుకు ప్రణాళిక రచించారు. 1857 ఆగస్టు 29న విప్లవకారులంతా నోగోరాలోని షేక్‌ బైకున్‌ ఇంట్లో సమావేశమై.. దుర్గాపూజ రోజు శివసాగర్‌, దిబ్రూగఢ్‌లను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఇదంతా ఆంగ్లేయులకు తెలిసిపోయింది. వెంటనే.. కందర్‌పేశ్వర్‌, మణిరామ్‌లతో పాటు ఇతర నాయకులనూ అరెస్టు చేశారు. విచారణలో దీనికంతటికీ మూలకారకుడు మణిరామ్‌గా తేల్చారు. 1858 ఫిబ్రవరి 26న జొర్హాట్‌లో ఆయనను బహిరంగంగా ఉరితీశారు. తద్వారా ప్రజల్లో భయాన్ని నింపాలని ఆంగ్లేయులు భావించారు. కానీ.. అసోం ప్రజలు మణిరామ్‌ మరణాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. తేయాకు తోటలన్నింటినీ స్తంభింపజేశారు. నిరసనలు, బంద్‌లతో అసోం అట్టుడికింది. కానీ తెల్లవారు ఉక్కుపాదంతో ఈ తిరుగుబాటును అణచివేశారు. మణిరామ్‌ తేయాకు తోటలను వేలంలో ఆంగ్లేయులే స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:చెక్కలు చేద్దామనుకున్నారు.. దేశాన్ని రెండు ముక్కలుగా వదిలేశారు!

ABOUT THE AUTHOR

...view details