తెలంగాణ

telangana

ఆటో డ్రైవర్ జాక్​పాట్.. టికెట్ కొన్న ఒక్కరోజుకే రూ.25 కోట్లు.. విదేశాలకు వెళ్లే ముందే..

By

Published : Sep 18, 2022, 8:35 PM IST

Updated : Sep 18, 2022, 8:56 PM IST

Onam bumper lottery
Onam bumper lottery ()

ఆటో నడుపుతూ జీవితం సాగించేవాడు.. 'ఎప్పటికీ ఇంతేనా? ఇక జీవితంలో పైకి వెళ్లలేమా..!' అనుకున్నాడు. విదేశాలకు వెళ్తే కాస్తైనా వెనకేసుకోవచ్చు అని భావించాడు. మలేసియాలో చెఫ్​గా పనిచేసేందుకు ప్లాన్లు వేసుకున్నాడు. అంతలోనే లక్ష్మీదేవి అతడిని కరుణించింది.. వెతుక్కుంటూ వచ్చి మరీ కోట్ల వర్షం కురిపించింది..

కేరళ తిరువనంతపురానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ జాక్​పాట్ కొట్టాడు. ఓనం బంపర్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. శనివారం టికెట్ కొన్న అతడికి ఆదివారమే భారీ జాక్​పాట్ దక్కడం విశేషం. ఆటో డ్రైవర్​గా పనిచేసే అనూప్.. శ్రీవహారం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. శనివారం టికెట్ కొనేందుకు వెళ్లిన అతడు.. తొలుత వేరే టికెట్​ను తీసుకున్నాడు. ఏమనిపించిందో ఏమో గానీ.. తర్వాత ఆ టికెట్​ను వెనక్కి ఇచ్చేసి వేరే టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు అదే టికెట్​ రూ.25 కోట్లు తెచ్చిపెట్టింది.

.

నిజానికి అనూప్.. విదేశాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నాడు. షెఫ్​గా పనిచేసేందుకు మలేసియా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారమే అతడికి బ్యాంకు లోన్ సైతం మంజూరు అయింది. ఇందుకోసం బ్యాంకు అధికారులు తనకు ఫోన్ చేశారని, అయితే లోన్ తనకు వద్దని చెప్పేశానని అనూప్ వివరించాడు. ఇప్పుడు మలేసియా వెళ్లాలన్న ప్లాన్​ను సైతం విరమించుకున్నట్లు స్పష్టం చేశాడు.

"22 ఏళ్ల నుంచి నేను లాటరీలు కొంటున్నా. వంద రూపాయల టికెట్ నుంచి రూ.5 వేల ధర ఉండే టికెట్ వరకు చాలా కొన్నా. ఇప్పుడు కూడా నేను గెలుస్తానని అనుకోలేదు. లాటరీ ఫలితాలు కూడా చూడలేదు. తర్వాత నా ఫోన్ చెక్ చేసుకున్నా. నేను గెలిచానని తెలిసింది. నాకు నమ్మకం కలగలేదు. లాటరీ రిజల్ట్స్​ను నా భార్యకు చూపించా. ఈ లాటరీకే రూ.25 కోట్లు వచ్చాయని ఆమె నిర్ధరించింది. కానీ నాకు అప్పటికీ ఆశ్చర్యంగానే అనిపించింది. వెంటనే నాకు లాటరీ విక్రయించిన మహిళకు ఫోన్ చేసి అడిగా. నా టికెట్ పంపించా. ఆమె కూడా నేను గెలిచాననే చెప్పింది."
-అనూప్

పన్నులు అన్నీ చెల్లించిన తర్వాత అనూప్ చేతికి రూ.15 కోట్లు రానున్నాయి. ఈ డబ్బుతో ఏం చేస్తారని అడగ్గా.. కొత్త ఇంటిని నిర్మించుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం తనకు ఉన్న అప్పులను తీర్చేస్తానని తెలిపాడు. బంధువులకు సహాయం చేసి.. ఛారిటీ కార్యక్రమాలకు కాస్త వెచ్చిస్తానని వివరించాడు. కేరళలో హోటల్ రంగంలోనే ఏదైనా ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. లాటరీలు కొనడం కొనసాగిస్తానని అనూప్ చెబుతున్నాడు.

ఆదివారం గోర్కీ భవన్​లో నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతల టికెట్ నెంబర్​లను కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రకటించారు. ఈ ఏడాది రెండోస్థానంలో నిలిచిన వ్యక్తి రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. మరో పది మంది.. ఒక్కొక్కరు కోటి రూపాయల చొప్పున జాక్​పాట్ కొట్టారు. అయితే, గతేడాది ఓనం బంపర్ లాటరీని సైతం ఆటో డ్రైవరే దక్కించుకోవడం విశేషం.

కేరళ ఆర్థిక మంత్రి
Last Updated :Sep 18, 2022, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details