ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాయచోటి భూదందా కేసు.. సబ్​ రిజిస్ట్రార్​పై బదిలీ వేటు

By

Published : Dec 26, 2022, 9:49 PM IST

Criminal Case Registered Against Sub Registrar Shyamaladevi : అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసిన రాయచోటి భూ దందాలో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. అంతేకాకుండా వైసీపీ నేతలు కాజేయాలని చూసిన భూమి యధాతథంగా ప్రభుత్వ భూమిగానే కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Rayachoti Land occupied
రాయచోటి భూదందా

Criminal Case Registered Against Sub Registrar Shyamaladevi : అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన 13 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌ను తిరస్కరిస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కడప గ్రామీణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌పై రిఫ్యూసల్ ఆర్డర్ జారీ చేశారు. యధాతథంగా ప్రభుత్వ భూమి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసిన సబ్‌రిజిస్ట్రార్‌ శ్యామలాదేవిని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ విభాగానికి బదిలీ చేశారు. శ్యామలాదేవిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు రాయచోటి పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది : రాయచోటి పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు వైసీపీ ప్రజాప్రతినిధి కుట్రపై... ఈటీవీ-ఈనాడు కథనాలతో అధికారులు స్పందించారు. అక్రమార్కులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయచోటి మాసాపేటలో సర్వే నంబర్‌ 971/1లోని 83 ఎకరాల ప్రభుత్వ భూమిలో 40 ఎకరాలను కలెక్టరేట్‌ సముదాయానికి, 30 ఎకరాలను వివిధ ప్రభుత్వ శాఖల భవనాలకు కేటాయించారు. మిగిలిన 13 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి వైసీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

రాయచోటిలో కాకుండా కడప రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెండింగ్‌ రిజిస్ట్రేషన్ కింద గత నెల 9న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాయచోటి మాసాపేటకు చెందిన షేక్ హరూన్‌బీ, ఆమె కుమారుడు షేక్ ఖాదర్‌ బాషాల నుంచి.. లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడుకు చెందిన వైసీపీ నాయకులు హరినాథ్‌రెడ్డి, జింకా రమేశ్‌, తాడిపత్రికి చెందిన గజేంద్రరెడ్డి, రాయచోటికి చెందిన యూసుఫ్‌ కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఈ భూముల రిజిస్ట్రేషన్‌కు 30 లక్షల రూపాయల స్టాంప్‌ డ్యూటీ చెల్లించారు.

భూములపై ఎలాంటి పరిశీలన చేయకుండానే.. రాజకీయ ఒత్తిళ్లతో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు కడప రూరల్ సబ్‌ రిజిస్ట్రార్‌ శ్యామలాదేవిపై ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ చేశాక పరిశీలన కోసం ఈ నెల 21న రాయచోటి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపినప్పుడు బండారం బయటపడింది. అవి ప్రభుత్వ భూములని తేలడంతో.. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గిరీశ అధికారులను ఆదేశించారు.

దొంగ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న 13 ఎకరాలు ప్రభుత్వ భూమేనని.. రాయచోటి తహసీల్దార్‌ రవిశంకర్‌రెడ్డి స్పష్టంచేశారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసిన, చేసుకున్నవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదుచేశారు. తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు రాయచోటి పోలీసులు ఏడుగురిపై క్రిమినల్‌ కేసులు పెట్టారు. దీంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని శ్యామలదేవిని ఇతర విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా పోలీసుల ఆమెపై క్రిమినల్​ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details