ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP: 'చంద్రబాబు జోలికొస్తే ఊరుకోం..సహనం నశిస్తే రోడ్లపై తిరగలేరు'

By

Published : Sep 18, 2021, 4:52 PM IST

'చంద్రబాబు జోలికొస్తే ఊరుకోం..సహనం నశిస్తే రోడ్లపై తిరగలేరు'
'చంద్రబాబు జోలికొస్తే ఊరుకోం..సహనం నశిస్తే రోడ్లపై తిరగలేరు'

జెడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన చంద్రబాబు ఇంటిమీద దాడికి యత్నించిన ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు పోలీసులే మద్దతుగా నిలిచారని తెదేపా నేతలు మండిపడ్డారు. మంత్రి పదవి కోసమే జోగి రమేశ్‌..చంద్రబాబు ఇంటి వద్ద హడావిడి చేశారని ఆక్షేపించారు. తమపై దాడి చేసి మళ్లీ రివర్స్​లో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని..సహనం నశించి తిరగబడితే వైకాపా నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి అమానుషమంటూ..విజయవాడలోని జిల్లా తెదేపా కార్యాలయం వద్ద కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నల్లజెండాలతో నేతలు నిరసన తెలిపారు. మంత్రి పదవి కోసమే జోగి రమేశ్‌....నిన్న చంద్రబాబు ఇంటి వద్ద హడావిడి చేశారని కొల్లు మండిపడ్డారు. చంద్రబాబు ఒకమాట చెప్తే వైకాపా నేతలు రోడ్ల మీద తిరగలేరని హెచ్చరించారు. వైకాపా నేతలను ఏపీ నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

జగన్​కు పాలన కిమ్​ను తలపిస్తోంది

రాష్ట్రంలో జగన్ పాలన కిమ్ పాలనను తలపిస్తోందని మాజీమంత్రి పీతల సుజాత మండిపడ్డారు. చంద్రబాబుని ఏం చేయాలనుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్​ను ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

'తాలిబన్లకు వారికి తేడా లేదు'

చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి, తెదేపా నేతలపై అక్రమ కేసుల నమోదుకు..ఐపీఎస్ అధికారులు రాత్రంతా డీజీపీ కార్యాలయంలో సమావేశం కావటం సిగ్గుచేటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ధ్వజమెత్తారు. జగన్ మెప్పు పొంది మంత్రి పదవి తెచ్చుకునేందుకే..జోగి రమేశ్ తప్పతాగి చంద్రబాబు ఇంటిపైకి దాడికి వచ్చాడని విమర్శించారు. పోలీసులే జోగి రమేశ్ కు భద్రత ఇచ్చి దాడికి అవకాశం కల్పించటాన్ని సభ్య సమాజం అసహ్యించుకుంటోందన్నారు. తాలిబన్లకు, వైకాపా రౌడీలకు తేడా లేదన్న బొండా..,తమ సహనం నశిస్తే ఎవరినీ వదలమని హెచ్చరించారు.

అల్లరిమూకతో దండయాత్ర

జోగి రమేశ్ చంద్రబాబుకు విజ్ఞాపన ఇచ్చేందుకే వస్తే..,అల్లరిమూకతో దండయాత్రగా ఎందుకు రావాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని మాజీమంత్రి జవహర్ నిలదీశారు. చంద్రబాబుని తిడితే తప్ప మంత్రివర్గంలో చోటు లభించదనే దురుద్దేశం జోగిరమేశ్​లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తన అధికారం కోసం మాట్లాడుతున్న జోగి రమేశ్...బీసీ ఉప ప్రణాళిక, ఆదరణ పనిముట్లపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

పోలీసులే మద్దతు నిలిచారు

జెడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన చంద్రబాబు ఇంటిమీద దాడికి యత్నించిన ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు పోలీసులే మద్దతుగా నిలిచారని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి సంఘటనను ఖండిస్తూ అనంతపురంలో తెదేపా నేతలు ర్యాలీ నిర్వహించారు. జోగి రమేష్ కర్రలు, మారణాయుధాలతో చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్తుంటే..పోలీసులు ఎందుకు నిలువరించలేదని ఆయన నిలదీశారు.

సహనం నశిస్తే..రోడ్లపై తిరగలేరు

ముఖ్యమంత్రి, మంత్రులు నీచంగా మాట్లాడినప్పుడు డీజీపీకి కనిపించ లేదా ? అని తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిలదీశారు. అయ్యన్నపాత్రుడు వాస్తవాలు చెబితే..ఎందుకు భరించలేకపోతున్నారని మండిపడ్డారు. తెదేపా క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్న బుచ్చయ్య..సహనం నశించి తిరగబడితే వైకాపా నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు.

చంద్రబాబు జోలికొస్తే ఊరుకోబోం

తమపై దాడి చేసి మళ్లీ రివర్స్​లో తప్పుడు కేసులు పెట్టే దుస్థితికి జగన్​ దిగజారారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ప్రతిపక్ష నేత ఇంటిపైకి అల్లరిమూకని పంపిన జగన్..ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి తెదేపా నాయకుల్ని అరెస్ట్ చెయ్యటం దారుణమన్నారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గబోమని..చంద్రబాబు జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

ABOUT THE AUTHOR

...view details