Telangana Weather Report Today : తెలంగాణపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సూర్యుడి భగభగలకు జీవజాతులు మొత్తం అల్లాడిపోతున్నాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జగిత్యాల, నల్గొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Telangana Weather Report Today
Telangana Weather Report Today : భానుడి ఉగ్రరూపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 8 జిల్లాల్లో 45.5కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43.2 డిగ్రీలు దాటాయి. తీవ్రమైన వడగాల్పుల ప్రభావానికి జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎండ వేడిమి తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది. ఉదయం 9 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు.
రాష్ట్రంలో ఇవాళ 45 డిగ్రీల పైగా నమోదయిన జిల్లాల వివరాలు :
జిల్లా
ప్రాంతం
నమోదైన ఉష్ణోగ్రత
జగిత్యాల
జైన
46.2
నల్గొండ
మాడ్గులపల్లి
46.2
కరీంనగర్
కొత్తగట్టు
46
సిద్ధిపేట
దూల్మిట్ట
45.9
మంచిర్యాల
జన్నారం
45.7
ములుగు జిల్లా
మల్లూరు
45.6
జోగులాంబ గద్వాల
వడ్డేపల్లి
45.6
నిర్మల్
లింగాపూర్
45.5
వరంగల్
ఉర్సు
45.4
జనగాం
జనగాం పట్టణం
45.3
పెద్దపల్లి
మంథని
45.3
జయశంకర్ భూపాలపల్లి
చిట్యాల
45.3
కొమరంభీం ఆసిఫాబాద్
జంబుగ
45.3
మహబూబాబాద్
కొమ్ములవంచ
45.1
Highest Temperature in Telangana : ఏప్రిల్లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. గత రెండు రోజులుగా తీవ్రమైన వడగాల్పులు వీచాయి. మరో 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
Old People Effect Heavy Temperature : వృద్ధులు, చిన్న పిల్లలపై ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బయటకు రావద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరించారు. తలపై ఎండ తగలకుండా ఉండేందుకు గొడుగు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లను వెంట తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండ దెబ్బ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులతో పాటు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.