తెలంగాణ

telangana

రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు ప్రభుత్వం కసరత్తు - మార్చి మొదటి వారంలోనే!

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 6:52 AM IST

Telangana Govt Working to Implement Farmer Loan Waiver : రైతు రుణమాఫీ హామీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రూ.2 లక్షల వరకూ ఉన్న రుణాలను సర్కారు తన ఖాతాకు బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ దిశగా రిజర్వు బ్యాంకు, బ్యాంకర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Farmer Loan Waiver
Telangana Govt Working to Implement Farmer Loan Waiver

రైతు రుణమాఫీ అమలుకు ప్రభుత్వం కసరత్తు - వచ్చే నెల మొదటి వారమే

Telangana Govt Working to Implement Farmer Loan Waiver :ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల పంట రుణాలను మాఫీ(Rythu Runa Mafi) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రూ.2 లక్షలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోను విడుదల చేసి కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఇటీవల బడ్జెట్​ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని పొందుపరిచారు. ఇచ్చిన హామీ మేరకు రైతులను రుణ విముక్తులను చేస్తామని పేర్కొంది. రుణమాఫీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలోని బ్యాంకర్లతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించి రైతుల రుణాల మాఫీవిషయమై రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. రెండు లక్షల రూపాయల్లోపు రైతుల అప్పుల మొత్తం రూ.35 వేల కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. అంత భారీ మొత్తం ఒకేమారు చెల్లించే అవకాశం లేదు. దీంతో ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సర్కార్​కు వివిధ రూపాల్లో వచ్చే ఆదాయాన్ని దానికి కొంత మేర జమయ్యేలా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేసింది.

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్​కు పొంతనలేదు : కడియం శ్రీహరి

Rythu Runa Mafi in Telangana :రిజర్వు బ్యాంకు(RBI)తో కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దాన్ని ఎఫ్​ఆర్​బీఎం(FRBM) పరిధిలోకి రాకుండా చూసేలా చర్చలు జరుపుతున్నారు. బుధవారం నాటి కొడంగల్ సభలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించారు. త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అన్న సీఎం ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణాల మాఫీ చేసి రైతులను విముక్తులను చేస్తామని ప్రకటించారు.

లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ ముందే ప్రకటన :రుణమాఫీ అంశానికి సంబంధించి ఆర్బీఐ, బ్యాంకర్లతో పాటు కేంద్ర ప్రభుత్వంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తోంది. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule)​ ప్రకటనకు ముందు అమలు కార్యాచరణ ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న కసరత్తు వచ్చే నెల మొదటివారంలో ఓ కొలిక్కి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుదీరిన వారం రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే విధంగా బుధవారం జరిగిన కోస్గి బహిరంగసభలో సీఎం రేవంత్​ రెడ్డి వారం రోజుల్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ.500లకే గ్యాస్​ సిలిండర్​ పథకాలను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. మార్చి 15న రైతుబంధు, రైతుభరోసా డబ్బులను ఇవ్వనున్నట్లు తెలిపారు.

రైతులకు గుడ్​న్యూస్ - ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్

త్వరలోనే కర్షకులకు రుణమాఫీ - కౌలుదారులకు రైతుబంధు

ABOUT THE AUTHOR

...view details