తెలంగాణ

telangana

వేసవిలో తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వం ఫోకస్ - నాగార్జునసాగర్‌లో కనీస మట్టానికి దిగువ నుంచి తీసుకునేలా ప్లాన్!

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 9:43 AM IST

Telangana Govt Focus on Drinking Water Supply : ఎండకాలంలో తాగునీటి ఎద్దడి నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే శనివారం వేసవి కార్యాచరణపై నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. నాగార్జునసాగర్‌లో కనీస మట్టానికి దిగువ నుంచి తీసుకుందామని ఇందుకోసం కేఆర్​ఎంబీకి లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు.

telangana govt focus on drinking water supply
telangana govt focus on drinking water supply

Telangana Govt Focus on Drinking Water Supply :రాష్ట్రంలో వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నీటిపారుదల, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల అధికారులు శనివారం సంయుక్తంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నాగార్జునసాగర్‌ కనీస నీటిమట్టం దిగువన నీటిని వినియోగించుకోవడానికి అనుమతించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. నారాయణపూర్‌ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటి విడుదలకు కర్ణాటకకు లేఖ రాయడంతో పాటు సంప్రదింపులు జరపాలని ప్రభుత్వానికి అధికారులు సూచించారు.

Revanth Review Summer Drinking Water Supply :ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) రిజర్వాయర్లలో నీటి నిల్వలు, మిషన్‌ భగీరథ కింద అవసరాలు, నీరు అందని ప్రాంతాలకు సరఫరా తదితర అంశాలపై చర్చించారు. రిజర్వాయర్ల వారీగా ఏప్రిల్‌ 30 తర్వాత 3 నెలల అవసరాలు ఎంత? ఎక్కడ కొరత ఉంటుంది? అలాంటి చోట ఏం చేయాలన్న దానిపై సమీక్ష నిర్వహించారు. గోపలదిన్నె, శంకరసముద్రం, రమణపాడు, పాలేరు, జూరాల తదితర రిజర్వాయర్ల కింద నీటికి కొరత ఏర్పడే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు సీఎం రేవంత్​రెడ్డికి వివరించారు.

విద్యుత్‌ కోతలు విధిస్తే సస్పెండ్‌ చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలోని ప్రతీ నివాస ప్రాంతానికి తాగునీరు అందేలా వివిధ శాఖలు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్రణాళికలు రూపొందించాల‌ని అధికారుల‌ను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆదేశించారు. గతంలో వదిలేసిన అనేక నీటి వ‌న‌రుల‌ను వినియోగంలోకి తెచ్చే అవ‌కాశాలను ప‌రిశీలించాల‌ని ఆయన సూచించారు. ఈ సమావేశం తర్వాత తాగునీటిపై వేసవి కార్యాచరణ రూపొందించాలని ప్రభత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి మూడు శాఖల అధికారులను కోరారు. దీనిపై పంచాయతీరాజ్‌, నీటిపారుదల, పురపాలక శాఖల కార్యదర్శులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, రాహుల్‌ బొజ్జా, దానకిషోర్‌ ఆ శాఖల ఇంజినీర్లు, అధికారులు శనివారం సుదీర్ఘంగా చర్చించారు.

  • నాగార్జునసాగర్‌ నుంచి పాలేరు రిజర్వాయర్‌కు ఏప్రిల్‌లో 2.5 టీఎంసీలు విడుదల చేయాలని తద్వారా జూన్‌ వరకు సరిపోతాయని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
  • నాగార్జునసాగర్‌లో (Nagarjuna Sagar) తెలంగాణ వాటాగా 7 టీఎంసీలు ఉంది. హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాతో కలిసి 11 టీఎంసీలు అవసరమని నిర్ధారించారు. దీంతో కనీస నీటిమట్టం 510 అడుగుల దిగువన 505 అడుగుల వరకు నీటిని తీసుకోవడానికి అనుమతించాలని కోరుతూ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు.
  • శ్రీశైలం నుంచి ముచ్చుమర్రి ద్వారా నీటిని తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్​ను నియంత్రించాలని కోరనున్నారు.
  • జూరాలకు మూడు టీఎంసీలు అవసరమవుతాయని గుర్తించారు. ఇందుకోసం నారాయణపూర్‌ నుంచి విడుదల చేయాలని కోరుతూ కర్ణాటకకు లేఖ రాయడంతోపాటు ఆ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ నేరుగా సంప్రదింపులు జరపాలని కూడా సూచించినట్లు తెలిసింది.

హైదరాబాద్​లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలి : మంత్రి పొన్నం

'ఈసారి వరి వద్దు - ఆరుతడి పంటలే సాగు చేయండి'

ABOUT THE AUTHOR

...view details