RS Praveen Kumar Tweet On Kcr :బీఆర్ఎస్ తనపై పెట్టిన విశ్వాసాన్ని వమ్ము చేయనని పేద ప్రజలకిచ్చిన మాట తప్పనని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. తనపై నమ్మకంతో నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన "ఎక్స్" వేదికగా స్పందించారు.
RS Praveen Kumar On Rumors : పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న తన లక్ష్యం నుంచి ఈ చిల్లర దాడులు దూరం చేయలేవని ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. ఇన్నాళ్లు ప్రజాక్షేత్రంలోనే ఉండి పీడిత ప్రజల కోసం పనిచేశానని తెలిపారు. చట్ట సభల్లో ప్రజాగొంతుకగా ఉండాలనే ఎంతో విలువైన ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. అసెంబ్లీలో బహుజనుల గొంతుకగా ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించినప్పటికీ మొదటి ప్రయత్నంలో విఫలమయ్యానని ఆవేదన చెందారు. తెలంగాణ వాదం బహుజన వాదం రెండూ ఒక్కటేనని నమ్మి ఎంతో శ్రమించి కేసీఆర్ను బీఎస్పీ మాయావతిని ఒప్పించి తెలంగాణలో చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశానని వివరించారు.
"నా రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవు. అయితే విషయాన్ని అర్థం చేసుకోకుండా నాపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని శక్తులు (కొంత మంది ఆప్తులతో సహా) తీవ్రమైన దాడి చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి అనాగరికమైన దాడులు నాకు కొత్త కాదు" - ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
రాజ్యాంగ విలువల రక్షణకోసం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఇచ్చిన మాట ప్రకారం విశాల తెలంగాణ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం భారత రాజ్యాంగ విలువల రక్షణ కోసం కేసీఆర్తో కలసి ప్రయాణించాలనుకున్నానని చెప్పారు. బీజేపీ కుట్రల నుంచి దేశాన్ని రక్షించే ధమ్ము - ధైర్యం కాంగ్రెస్కు ముమ్మాటికీ లేదు అందుకే నేను ఇటీవలే బీఆర్ఎస్లో చేరానంటూ తన మనసులో మాట వివరించారు.