MLA Kadiyam Srihari Vs Minister Sridhar Babu : అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. సమావేశం ప్రారంభమైన కాసేపటికే శాసనసభలో కోరంపై చర్చ నేపథ్యంలో ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. సభ ప్రారంభం కాగానే కోరం లేదని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిపడా సభ్యులు ఉన్నారని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమ పార్టీ తరపున సరైన సంఖ్యలో సభ్యులు ఉన్నప్పటికీ భారత్ రాష్ట్ర సమితి సభ్యులు తప్పుడు సంకేతాలు పోయేలా చేయడం, ఉద్దేశపూర్వకంగా బయటకు వెళ్లిపోవడం సబబు కాదని ఆయన అన్నారు. కేవలం పది శాతం మంది సభ్యులు ఉంటే కోరం సరిపోతుందని అన్నీ తెలిసి కూడా సీనియర్ సభ్యుడు హరీశ్రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీధర్బాబు అన్నారు.
శాసనసభలో కోరం లేదని బీఆర్ఎస్ అభ్యంతరం - కడియం, శ్రీధర్బాబు మధ్య డైలాగ్ వార్
Published : Feb 14, 2024, 11:25 AM IST
|Updated : Feb 14, 2024, 11:47 AM IST
MLA Kadiyam Srihari Vs Minister Sridhar Babu : తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి శ్రీధర్బాబు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. బడ్జెట్పై చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఇద్దరూ లేకపోవడం ప్రభుత్వ తీరును ఉదహరిస్తోందని కడియం శ్రీహరి అన్నారు. దీనిపై స్పందించిన శ్రీధర్బాబు కొన్ని కారణాల వల్ల వారు రాలేకపోయారని, తాను, తన మంత్రివర్గ సహచరులు సభలోనే ఉన్నామని వివరించారు.
మరోవైపు సభను పది గంటలకు కాకుండా ఆరు, ఏడు నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించడం తగదని ఎక్కడైనా సమయ పాలన పాటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. బడ్జెట్పై చర్చ జరుగుతుంటే సంబంధిత ఉప ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి సభలో లేరని వ్యాఖ్యానించారు. తాము ఉన్నామని, అధికారులు కూడా ఉన్నారని మంత్రి శ్రీధర్బాబు (Minister Sridhar Babu)వివరణ ఇచ్చారు. డిప్యూటీ సీఎం వచ్చిన తర్వత వివరణ ఇస్తారని అన్నారు. ఒకేఒక్క అధికారి మాత్రమే సభలో ఉన్నారన్న కడియం శ్రీహరి, సభ నిర్వహణలో ప్రభుత్వానికి తగిన శ్రద్ధ లేదని ఆయన పేర్కొన్నారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్