Justice PC Ghose Commission Inquiry on Kaleshwaram :కాళేశ్వరం ఎత్తిపోతల ఆనకట్టలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) నేతృత్వంలో న్యాయ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. శనివారం నాడు హైదరాబాద్లోని బీఆర్కేభవన్లోని కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్ కార్యాలయంలో ఆయన నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో మరోమారు భేటీ అయ్యారు.
ఈఎన్సీలు నాగేంద్రరావు, అనిల్కుమార్, సీఈ సుధాకర్రెడ్డిలతో సమావేశమైన అనంతరం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లుతోనూ జస్టిస్ పీసీ ఘోష్ భేటీ అయ్యారు. జస్టిస్ ఘోష్ ఎత్తిపోతలకు సంబంధించిన వివరాలపై వెంకటేశ్వర్లును ప్రశ్నలు అడుగగా ఆయన సమాధానాలు ఇచ్చారు. అందిన సమాచారం మేరకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందని కమిషన్ అడిగిన ప్రశ్నకు, లైడార్ సర్వేలో వచ్చిన ఫలితాలు, వ్యాప్కోస్ సంస్థతో సర్వే, మహారాష్ట్రలో ముంపు ఉండటంతోనే మేడిగడ్డ వద్దకు మార్చాల్సి వచ్చిందని మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కమిషన్కు తెలిపారు.
Kaleshwaram Barrages Issue Updates :మేడిగడ్డ ఆనకట్ట డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయన్న దానిపై, మేడిగడ్డను స్పెషల్గా డిజైన్ చేసినట్లు, బ్యారేజీ కమ్ డ్యాం తీరులో ఉపయోగించుకునేలా నిర్మాణం చేపట్టినట్లు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కమిషన్కు వివరించారు. ప్రాజెక్టు తీరుపై మాజీ ఈఎన్సీ కొంత నిడివితో కూడిన ప్రజంటేషన్ ఇవ్వడంతో పాటు తనకు 2 గంటల సమయం ఇస్తే మరిన్ని వివరాలు అందజేస్తానని కమిషన్కు చెప్పినట్లు తెలిసింది.