తెలంగాణ

telangana

'రజాకార్ల నుంచి హైదరాబాద్ ముక్తి పొందాలంటే బీజేపీని గెలిపించండి' - AMIT SHAH CAMPAIGN IN HYDERABAD

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 10:31 PM IST

Amit Shah Election Campaign in Hyderabad : హైదరాబాద్‌ లోక్​సభ స్థానం గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ, ప్రచారంలో దూకుడు పెంచింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రోడ్‌ షో నిర్వహించారు. రజాకార్ల గుప్పిట్లో చిక్కుకుపోయిన హైదరాబాద్​కు విముక్తి కలగాలంటే ఈసారి బీజేపీకే ఓటు వేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Lok Sabha Polls 2024
Amit Shah Election Campaign in Hyderabad

Amit Shah to Campaign for Hyderabad MP Candidate Madhavi Latha :హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ అధిష్ఠానం స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు కమలం నేతలు. పాతబస్తీలో పాతుకుపోయి ఉన్న ఎంఐఎంకు ధీటుగా ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారంలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ దిశగానే బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా ఇవాళ రాష్ట్ర రాజధానిలో రోడ్ షో నిర్వహించారు.

ఈసారి ఎలా అయినా అసదుద్దీన్‌ను ఓడించడమే లక్ష్యంగా కమల దళం అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే లాల్ దర్వాజా మహంకాళి ఆలయం నుంచి శాలిబండ సుధా టాకీస్‌ వరకు అమిత్‌ షా రోడ్‌ షో కొనసాగగా, అడుగడుగున అశేష జనం నీరాజనం పట్టారు. పలువురు మహిళలు బోనాలుతో ఎదురై, స్వాగతం పలికారు. దీంతో రాజధాని రోడ్లన్నీ కాషాయమయమయ్యాయి. కాగా అమిత్ షా రాక కాస్త ఆలస్యమవటంతో అనుకున్న స్థాయిలో ప్రచారం జరగక, కొంత హడావుడిగానే ముగించాల్సి వచ్చింది.

ప్రచార సమయం దగ్గరపడటంతో అమిత్​షా ప్రసంగం సైతం 5నిమిషాలు మాత్రమే జరిగింది. రోడ్‌ షో ముగించుకుని అమిత్ షా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ చేవెళ్ల, నాగర్​కర్నూల్‌, మహబూబ్​నగర్​ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. నేతల నుంచి వచ్చిన సమాచారం మేరకు పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Amit Shah Guides to Party Leaders for Lok Sabha Elections :కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రధాని మోదీ పదేళ్లలో ప్రవేశపెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్, సాహాసోపేతమైన నిర్ణయాలు, రాష్ట్రానికి చేసిన సహాయాన్ని వివరించడంతో పాటు కేంద్రంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించేలా పార్టీ నేతలకు మార్గనిర్దేశనం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మీటింగ్ ముగించుకున్న తర్వాత రాష్ట్ర కార్యాలయం నుంచి బేగంపేట ఐటీసీ కాకతీయకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details