తెలంగాణ

telangana

కేసీఆర్‌ పిట్టల దొరలా ఏదేదో మాట్లాడుతున్నారు - పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతాం : సీఎం రేవంత్‌ రెడ్డి - Lok Sabha Nominations In Telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 3:14 PM IST

Updated : Apr 20, 2024, 4:02 PM IST

CM Revanth Participated in Neelam Madhu Nomination Rally : కాంగ్రెస్‌ సర్కారు పథకాలు చూసి కేసీఆర్‌ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పిట్టల దొరలా మారి, కేసీఆర్‌ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో మెదక్‌ జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? అని ప్రశ్నించిన రేవంత్‌, దుబ్బాకకు మోదీ ఇచ్చిన నిధులెన్నో రఘునందన్​ రావు చెప్పాలని సవాల్‌ చేశారు.

CM Revanth Reddy Fires on KCR
CM Revanth Participated in MP Nomination Rally

కేసీఆర్‌ పిట్టల దొరలా ఏదేదో మాట్లాడుతున్నారు - కాంగ్రెస్​పై చెయ్యేస్తే మాడి మసైపోతారు : సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Participate in Nomination Rally :ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే వరి పంటకు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన సీఎం, మోదీ, కేసీఆర్‌, మెదక్ ప్రాంతాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని అన్నారు.

హస్తం పార్టీపై చెయ్యి వేస్తే మాడి మసైపోతారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ సర్కారు పథకాలు చూసి కేసీఆర్‌ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. పిట్టల దొరలా మారి, కేసీఆర్‌ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. పేదలకు ఎప్పుడూ అండగా నిలబడేది మూడు రంగుల జెండానేనని, కాంగ్రెస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని రేవంత్‌ కోరారు.

"కాంగ్రెస్ హామీల అమలు చూసి ఓర్వలేని కేసీఆర్, హరీశ్​రావు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మెదక్ వేదికగా తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15వ తేదీ లోపల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మాది. మా ప్రభుత్వానిది. అంతేకాదు వచ్చేసారి పండించే వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది." -రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5లక్షల ఇళ్లు నిర్మించాలని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ప్రారంభించామని తెలిపారు. పేదోడికి సొంత ఇల్లు ఉంటే గౌరవంగా జీవిస్తారని, ఆ దిశగానే తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి, ఇచ్చే ఇళ్లను రద్దు చేయాలని దిల్లీలో ఉండే మోదీ, గజ్వేల్‌లో ఉండే కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పేదవాడి కళ్లలో ఆనందం చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. వచ్చే వరి పంటను రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత తనదేనని పునరుద్ఘాటించారు.

CM Revanth Fires on Opposition Parties : పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రధాని మోసం చేశారని ఆక్షేపించారు. మీ బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామన్నారు. మరి ఒక్క రూపాయి అయినా వేశారా అని ప్రశ్నించిన రేవంత్​రెడ్డి, దిల్లీలో రైతులను చంపిన బీజేపీని బొంద పెట్టాలన్నారు. మల్లన్నసాగర్‌లో వేల ఎకరాలు గుంజుకున్నది ఎవరో మనకు తెలియదా? ఆనాడు కలెక్టర్‌గా ఉండి పేదల భూములు గుంజుకున్న వ్యక్తే, నేడు బీఆర్ఎస్ అభ్యర్థి అని గుర్తుచేశారు.

పేద ముదిరాజ్‌ బిడ్డకు మెదక్‌ టికెట్ ఇచ్చాం - గెలిపించే బాధ్యత మీదే :కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్‌ ప్రజలు ఇందిరమ్మను గెలిపించారన్నారు. ఇందిరాగాంధీ, హైదరాబాద్‌కు అనేక పరిశ్రమలు కేటాయించారని, బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఇక్రిశాట్‌ను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. పేద ముదిరాజ్‌ బిడ్డకు ఎంపీ టికెట్‌ ఇచ్చామన్న రేవంత్​రెడ్డి, గెలిపించే బాధ్యత మీదేనని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పలువురు కాంగ్రెస్‌ నేతలు నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లోక్‌సభ ప్రచార బరిలో జోరు పెంచిన కాంగ్రెస్‌ - 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేతల వ్యూహాలు - Congress campaign six guarantees

బీజేపీ బీఆర్​ఎస్​ లోపాయికారి ఒప్పందంతో కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నాయి : తుమ్మల - Tummala on BJP and BRS

Last Updated :Apr 20, 2024, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details