తెలంగాణ

telangana

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్​ దర్యాప్తు ముమ్మరం- అనుమానితుడి గుర్తింపు! 8 బృందాలతో గాలింపు

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 10:32 AM IST

Updated : Mar 2, 2024, 11:06 AM IST

Rameswaram Cafe Blast Suspect : రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా ఓ అనుమానితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరోవైపు కర్ణాటక సీఎం అధికారులతో సమావేశం కానున్నారు.

Rameswaram Cafe Blast Suspect
Rameswaram Cafe Blast Suspect

Rameswaram Cafe Blast Suspect : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్​లో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కేఫ్​ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా అనుమానితుడి కదలికలను గుర్తించారు. అందులో ఆ వ్యక్తి ఒక బ్యాగ్‌ను కెఫేలోకి తీసుకెళ్లిన దృశ్యాలు ఉన్నట్లు పోలీసుల తెలిపారు. అనుమానితుడు ముఖానికి మాస్క్‌, కళ్లద్దాలు, క్యాప్‌ ధరించి బ్యాగ్​ను తీసుకెళ్లినట్లు సీసీటీవీలో రికార్డైందని చెప్పారు. అదే వ్యక్తి కెఫేలో ఇడ్లీ తిని బ్యాగ్​ను వదిలివెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.

పేలుడుకు ముందు, ఆ తర్వాత నిందితుడు వైట్ ఫీల్డ్​లోని మారత్​ గ్రామ ప్రాంతంలో తిరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ పేలుడుపై దర్యాప్తు జరిపేందుకు 8 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు 2022 నవంబర్​లో జరిగిన మంగళూరు కుక్కర్​ పేలుడు మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయమో అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.

హోంశాఖ అధికారులతో సమావేశం
మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం మధ్యాహ్నం హోంశాఖ సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ ఘటన వెనకు ఉన్నది ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్, బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు హాజరుకానున్నారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక, పేలుడుకు వినియోగించిన పదార్థాలు, గాయపడిన వారికి చికిత్స అందించడం వంటి విషయాలను చర్చించనున్నారు.

"మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో వచ్చి టైమర్‌ను అమర్చి బాంబ్​ పేల్చాడు . శుక్రవారమే డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నేను కూడా వెళ్తాను. ఈ పని ఏదైనా సంస్థ చేసిందా లేదా అనేది తెలీదు. ఇంకా దర్యాప్తు జరుగుతోంది. ఈ విషయంలో బీజేపీ రాజకీయలు చేయకూడదు. మంగళూరు, బెంగళూరు పేలుడుకు సంబంధం లేదు. రిపోర్ట్ వచ్చిన తర్వాతే తగిన చర్యలు తీసుకుంటాం." - సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం

రామేశ్వరం కెఫేలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. తొలుత గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు వల్ల జరిగిన ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే ఘటనాస్థలిలో ఓ హ్యాండ్‌ బ్యాగ్‌ పేలినట్లు కనిపించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్​ 307, 471, ఉపాలోని 16, 18, 38, పేలుడు పదార్థల చట్టంలోని సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేశారు. ఏ రకమైన బాంబును పేలుడుకు వాడారన్న దానిపై ఫోరెన్సిక్‌ బృందం ఘటనాస్థలంలో ఆధారాల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. ఎన్‌ఎస్జీ, బాంబు స్క్వాడ్‌ టీంలు కెఫే పరిసర ప్రాంతాల్లో కూంబింగ్‌ ముమ్మరం చేశాయి. అటు జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఘటనపై విచారణ జరుపుతోంది.

విదేశీయుడిని బెదిరించి క్యాబ్​ డ్రైవర్​ రూ.3.5 లక్షలు లూటీ- నెల రోజులుగా బిచ్చగాళ్లతోనే డచ్​ టూరిస్ట్​!

'అలాంటి ప్రచారాలకు దూరంగా ఉండండి'- రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్​

Last Updated : Mar 2, 2024, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details