'వ్యూహం' సినిమా విడుదలపై అక్కడే తేల్చుకోండి - పిటిషనర్కు స్పష్టం చేసిన హైకోర్టు
Published : Jan 3, 2024, 6:08 PM IST
VYOOHAM MOVIE TEAM PETITION: వ్యూహం సినిమా విడుదలపై సింగిల్ జడ్జి తీర్పులో కల్పించుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని సూచిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. చంద్రబాబును కించపరిచేలా, జగన్కు లబ్ధి చేకూర్చేలా వ్యూహం సినిమాను రూపొందించారని, సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్పై గతనెలలో హైకోర్టు వాదనలు వినగా, లోకేశ్ తరఫున వాదనలను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో సినిమా విడుదలను నిలిపివేస్తూ గత నెల 28న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
జనవరి 11వ తేదీ వరకు సెన్సార్ సర్టిఫికెట్ను సస్పెండ్ చేసింది. ఈ తీర్పును వ్యూహం చిత్ర యూనిట్ హైకోర్టు ధర్మాసనం ముందు సవాల్ చేసింది. సకాలంలో సినిమా విడుదల కాకపోవడం వల్ల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 8వ తేదీ లోపు విచారణ పూర్తిచేసేలా సింగిల్ జడ్జిని ఆదేశించాలని కోరారు. విచారణలో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం మెరిట్స్ ఆధారంగా కేసును విచారించాలని సింగిల్ జడ్జికి సూచిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.