Telangana Literature Day : 'రవీంద్రభారతిలో ఈనెల 11న సాహితీ దినోత్సవం'
Literature Day Celebrations in Telangana : రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న రవీంద్రభారతిలో సాహితీ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు పర్యాటక, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలుగు,ఉర్దూ రెండు భాషల్లో వచనం, పద్యం, కవిత్వం విభాగాల్లో పోటీలు నిర్వహించి, మొదటి ఐదు రచనలకు నగదు బహుమతి అందచేయనున్నట్టు తెలిపారు.
ఒకనాడు రాష్ట్రంలో కవులే లేరనే.. అవమానాలు ఎదుర్కున్నామని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కవులకు.. కళాకారులకు.. సాహితీవేత్తలకు.. కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ అసలు భాషనే కాదు అని అవమానించారని.. కానీ ఇప్పుడు తెలంగాణలో కవులకు కొదువ లేదు అని వెల్లడించారు. తెలంగాణ కవులకు ఎన్నో సత్కారాలు జరిగాయని.. ప్రపంచ సభల్లో పాల్గొన్న చరిత్ర తెలంగాణ కవులదని పేర్కొన్నారు. సాహితీ పోటీలు నిర్వహించటం వల్ల వారిలో పోటీతత్వం పెరిగి మరింత ఆదరణ పెరుగుతుందని తెలిపారు.