Gaddar suspended from Praja Shanti Party : గద్దర్ను సస్పెండ్ చేసిన కేఏ పాల్.. ఎందుకో తెలుసా..?
Singer Gaddar suspended from Praja Shanti Party : ప్రజాశాంతి పార్టీ నుంచి ప్రజా గాయకుడు గద్దర్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరి.. మునుగోడు ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పినట్లు కేఏ పాల్ గుర్తు చేసుకున్నారు. కానీ ఇవాళ దిల్లీలో ప్రెస్మీట్ పెట్టి మరో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం బాధాకరమని ఆరోపించారు. జనాభాలో 90శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లీంలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వీళ్లందరిని విభజించి విజయం సాధించాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీలంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీకి అనేక లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ప్రజా గాయకుడు గద్దర్ను పార్టీ అధ్యక్షుడి సూచన మేరకు ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చెసినట్లు ప్రజాశాంతి పార్టీ ప్రధాన కార్యదర్శి వి.మమతారెడ్డి ప్రకటించారు.