డిసెంబర్ 3న ఏనుగుపై అసెంబ్లీలో అడుగుపెడుతున్నాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen kumar Election Campaign at Nagar Kurnool : డిసెంబర్ 3న ఏనుగుపై అసెంబ్లీలో అడుగుపెడుతున్నామని, బహుజనులతో ప్రగతి భవన్కు వెళ్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని నలుగురు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బహుజనులు అందరూ కలిసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలు యువతను తప్పు దారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావొద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు టికెట్లు ఇచ్చిన ఘనత బీఎస్పీ పార్టీదేనని చెప్పారు. ఉద్యోగులకు వేతనాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. అందరూ ఏకమైనప్పుడు బహుజనులు అంతా ఎందుకు ఏకం కాకూడదని ప్రశ్నించారు. త్వరలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.