Tension in Huts Removal in Mahabubabad : ప్రభుత్వ స్థలాల్లో వేసిన గుడిసెల కూల్చివేత..
Tension at Huts Removal in Mahabubabad : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసుల సహకారంతో మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా తొలగించారు. తమ నివాసాలను తొలగించవద్దంటూ గుడిసెవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీ పైకి ఎక్కి పనులను అడ్డుకున్నారు. అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పెద్ద సంఖ్యలో స్థానికులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. వివాదం ముదురుతుండటంతో పోలీసులు కలగజేసుకుని ఆందోళనను ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. పరిస్థితి చేజారిపోతుండటంతో చివరకు ఆందోళనకారులను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.
ఈ సందర్భంగా పేద వాళ్లు 70 గజాల్లో గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వం వాటిని కూల్చివేస్తుందని.. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వందల ఎకరాలు ఆక్రమించి ప్లాట్లు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని కోరారు.