సుఖోయ్​ యుద్ధవిమానంలో ముర్ము చక్కర్లు.. చైనా సరిహద్దుకు సమీపంలోనే..

By

Published : Apr 8, 2023, 4:53 PM IST

thumbnail

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుఖోయ్‌ యుద్ధవిమానంలో ప్రయాణించారు. అసోంలో పర్యటిస్తున్న రాష్ట్రపతి.. ఉదయం తేజ్‌పుర్‌లోని వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానిక స్థావరానికి చేరుకున్నారు. భద్రతాదళాల నుంచి సైనిక వందనం స్వీకరించిన అనంతరం ఫ్లయింగ్‌ సూట్‌ ధరించి.. సుఖోయ్‌ యుద్ధవిమానంలో విహరించారు. రాష్ట్రపతి ముర్ము ప్రయాణించిన సుఖోయ్‌ జెట్‌ ఫైటర్‌కు గ్రూప్‌ కెప్టెన్‌ నవీన్‌ కుమార్‌ తివారీ పైలెట్‌గా వ్యవహరించారు. తేజ్‌పుర్‌ వైమానిక స్థావరం.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌కు సమీపంలోనే ఉంది.

ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని 11 ప్రదేశాలకు చైనా పేర్లు పెట్టిన నేపథ్యంలో తేజ్‌పుర్‌ వైమానిక స్థావరం నుంచి రాష్ట్రపతి ముర్ము సుఖోయ్‌ జెట్‌ ఫైటర్‌లో ప్రయాణించటం ప్రాధాన్యం సంతరించుకుంది. 2009లో దేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ కూడా సుఖోయ్‌ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఆ తర్వాత సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండో మహిళా రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము రికార్డు సాధించారు. 
మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం అసోం చేరుకున్నారు. శుక్రవారం కజిరంగ జాతీయ పార్కులో జరిగిన గజ్‌ ఉత్సవ్‌ను ఆమె ప్రారంభించారు. పర్యటనలో భాగంగా మౌంట్‌ కాంచనగంగ సాహసయాత్ర- 2023ను కూడా ఆమె ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.