Political Josh in Telangana Congress Party Leaders : కాంగ్రెస్ నేతల్లో ఫుల్ జోష్.. 90 సీట్లు గ్యారెంటీ అన్న కోమటిరెడ్డి
Published : Oct 20, 2023, 5:56 PM IST
Political Josh in Telangana Congress Party Leaders : నిత్యం వాగ్వాదాలతో భగ్గుమనే గాంధీభవన్లో ప్రశాంతత నెలకొంది. తరచూ కుమ్ములాటలతో రగిలిపోయే నేతలంతా ఒకే బండెక్కారు. నువ్వా-నేనా అంటూ ఒకరినొకరు వెనక్కి లాక్కునే నేతలంతా ఐక్యతా రాగం వినిపిస్తున్నారు. గెలిచే అవకాశాలు ప్రత్యర్థులకు అవకాశమిచ్చే నేతలు.. ఇక మాదే అధికారం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న కొత్త ఉత్సాహమిది. శాసనసభ సమరానికి పార్టీ అగ్రనేతలు శంఖారావం పూరించిన తరుణంలో.. నేతలంతా కలిసిసాగుతూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
మూడ్రోజులుగా రాష్ట్రంలో రాహుల్గాంధీ బస్సు యాత్ర కొనసాగుతుండగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఆయన వెంటే సాగుతున్నారు. దీనిపై పార్టీ నాయకులు స్పందిస్తూ ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 నుంచి 90 సీట్లు గెలుస్తుందని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని ఎద్దేవా చేశారు.