ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం - కేటీఆర్ అమెరికాకు పారిపోవడం ఖాయం : మైనంపల్లి హన్మంతరావు
Mynampally Hanmantha Rao Comments on CM KCR : తన కుమారుడు రోహిత్ స్మార్ట్గా ఉన్నాడని పొగిడిన నోటితోనే దిష్టిబొమ్మ అని విమర్శించడం ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు అన్నారు. తన కుమారుడిని అలా అనడానికి ఆయనకు నోరెలా వచ్చిందంటూ మండిపడ్డారు. మెదక్ జిల్లా నవాపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మైనంపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి ఆధ్వర్యంలో.. నవాపేటకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దొంతి లక్ష్మీ, మాజీ కౌన్సిలర్ ముత్యంగౌడ్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Congress Election Campaign 2023 in Medak : : ఫామ్హౌస్ కోసం ఏడాదికి రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నారు కానీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు కేసీఆర్కు చేతులు రావడం లేదని మైనంపల్లి విమర్శించారు. కేటీఆర్ తెలంగాణకు ఏం చేయలేదని.. అయినా మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. హామీ ఇచ్చినట్టుగా దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదని.. దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు.. ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తానని మాట తప్పారని హన్మంతరావు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను గద్దెదించడం ఖాయమని.. కేటీఆర్ అమెరికాకు పారిపోవడం తథ్యమని మైనంపల్లి వ్యాఖ్యానించారు.