Police Carry Dead Bodies : పోలీసుల మానవత్వం.. మృతదేహాలను భుజాలపై మోసి
Police Carry Dead Bodies on Shoulders : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కకావికలమైన మోరంచపల్లి గ్రామస్థులు విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. గ్రామానికి వెళ్లే మార్గం పూర్తిగా ధ్వంసం కాగా.. అనేక ఇళ్లు పూర్తిగా వరదలో మునిగిపోయాయి. పునరావాస కేంద్రాల్లో బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం మోరంచ వాగు ఉద్ధృతికి నలుగురు గల్లంతయ్యారు. గలంతైన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. వీరిలో ఇద్దరి మృతదేహాలను డ్రోన్ సహాయంతో గుర్తించారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన గొర్రె ఒదిరెద్ది మృతదేహాన్ని.. చిట్యాల మండలం ఒడితల గ్రామ శివారులో .. గంగిడి సరోజన మృతదేహాన్ని ఎస్ఎమ్ కొత్తపల్లి శివారులోని సోలిపేటలో పోలీసులు గుర్తించారు.
రెండు రోజుల నుంచి నీటిలో మృతదేహాలు ఉండటంతో.. వాటిని రోడ్డుపైకి తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో భూపాలపల్లి సీఐ రామ్నరసింహారెడ్డి, చిట్యాల ఎస్సై రమేశ్ మృతదేహాలను కర్ర సహాయంతో భుజాలపై ఎత్తుకొని ట్రాక్టర్ వరకు మోశారు. ఆపద సమయంలో పోలీసులు చూపిన మానవత్వాన్ని స్థానికులు ప్రశసించారు. మరోవైపు గలంతైన మరో ఇద్దరి కోసం ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లతో, గాలింపు చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ పేర్కొన్నారు.