ఆట పాటల మధ్య సందడిగా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం
Minister Sathyavathi Rathod Election Campaign at Mahabubabad : కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ,వారంటీ లేదని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలు ఏ విధంగా నమ్ముతారని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో సత్యవతి, బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. జిలేబీలు వేస్తూ, కూరగాయలు కొనుగోలు చేస్తూ, వినూత్నంగా ప్రచారం చేశారు. మహిళలతో కలిసి కోలాటం వేస్తూ నృత్యం చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అంటున్నారని, ఆ పార్టీకి 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని.. ఇలాంటి పథకాలు భారతదేశంలో ఏక్కడా అమలు కావడం లేదని సత్యవతి అన్నారు. ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ను, మహబూబాబాద్ నియోజకవర్గంలో శంకర్ నాయక్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.