భార్య మృతదేహాన్ని తోపుడు బండిపై తీసుకెళ్లిన భర్త- అంబులెన్స్​ ఇవ్వలేదని!!

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 5:17 PM IST

thumbnail

Man Carries Wife Dead Body On Cart Vehicle : గుండెపోటుతో ప్రభుత్వాస్పత్రిలో మరణించిన తన భార్య మృతదేహాన్ని తోపుడు బండిపై మోసుకెళ్తూ కనిపించాడు ఓ భర్త. ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​ జిల్లాలో ఈ అమానవీయ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది
ఎటా జిల్లా అస్రౌలి గ్రామానికి చెందిన వేద్​రామ్​ భార్య మోహర్​కు సోమవారం గుండెపోటు రావడం వల్ల చికిత్స నిమిత్తం ఆమెను ఫిరోజాబాద్​ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఇక్కడ మహిళకు ట్రామా సెంటర్‌లో మంగళవారం చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆమె మరణించింది. దీంతో మహిళ మృతదేహాన్ని పోస్ట్​మార్టం పరీక్షల తర్వాత ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు మృతురాలి భర్త, కుటుంబీకులకు సూచించారు. ఆ మేరకు అంబులెన్స్​ ఏర్పాటు చేయాల్సిందిగా భర్త ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నాడు. ఇందుకోసం చాలా సమయం ఆస్పత్రిలోనే వేచి ఉన్నాడు. ఎంతకీ ఎవరూ స్పందించకపోవడం వల్ల చేసేదేమీలేక చనిపోయిన భార్య మృతదేహాన్ని, భర్త తన బంధువు సాయంతో అక్కడే ఉన్న ఓ తోపుడు బండిపై వేసుకొని ఇంటి బాట పట్టాడు. 

దీనిని గమనించిన కొందరు స్థానికులు ఆ అమానవీయ దృశ్యాలను ఫోన్లలో బంధించారు. వాటిని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. అవి కాస్త వైరల్​గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్​ డా.నవీన్​ జైన్​ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే తమ ఊరు పక్క జిల్లాలో ఉందన్న కారణంతోనే అంబులెన్స్ నిరాకరించినట్లు మృతురాలి భర్త చెబుతున్నాడు. ఇతర జిల్లాలకు అంబులెన్స్​లను పంపలేమని, వాహనం కూడా అందుబాటులో లేదని వైద్యులు చెప్పారని ఆరోపిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.