Kishan Reddy Latest News : 'ప్రధాని మోదీ పాలనతోనే సంక్షేమాభివృద్ధి సాధ్యం'
BJP Door to Door Programme in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ పేరుతో కాషాయదళం ప్రజల వద్దకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క రోజే 35 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలింగ్ బూత్ అధ్యక్షుడు మొదలు.. రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఒక్కొక్కరూ కనీసం వంద కుటుంబాలను కలిసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీతోనే సంక్షేమాభివృద్ది సాధ్యమని, ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో దేశమంతా సుఖసంతోషాలతో ఉందని మరోసారి మోదీ ప్రధానిగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం, శ్రీనగర్ కాలనీ, అంబేడ్కర్ నగర్ బస్తీలో మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు మోదీ పథకాలను వివరించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.