Central Government Water Awards To Telangana : జాతీయ స్థాయిలో మెరిసిన జగన్నాథపురం
National Water Awards for Telangana jagannathapuram: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురానికి జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా జల అవార్డు దక్కడంపై పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తంచేశారు. అవార్డు ప్రకటించిన కేంద్రప్రభుత్వం, అవార్డులు వచ్చేందుకు ప్రేరణ, కారణమైన సీఎం కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ఉత్తమ నీటి విధానాలను అవలంభించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ఈ నాలుగో జాతీయ నీటి అవార్డులను కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. ఈ నెల 17న దిల్లీ విజ్ఞాన్ భవన్లో జరగనున్న కార్యక్రమంలో.. ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందించనున్నారు. అవార్డు పొందిన జగన్నాథపురం గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో రూపొందించి, అమలు చేస్తున్న పల్లెప్రగతి వల్లే రాష్ట్ర పంచాయతీలు దేశానికి ఆదర్శంగా మారి, అవార్డులు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు