వైభవంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం.. పాల్గొన్న గవర్నర్
Sita Rama Pattabhishekam at Bhadrachalam Temple : దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఆలయ అర్చకులు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవం నిర్వహిస్తున్నారు. కల్యాణం నిర్వహించిన మిథిలా మండపంలోనే ఈ క్రతువు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనుంది. పట్టాభిషేకం కోసం దేశంలోని నలుదిక్కులకు వెళ్లి నదులు, సముద్రాలు, సరస్సుల నుంచి వైదిక సిబ్బంది పుష్కర జలాలు తీసుకొచ్చారు. ఈ శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. రామ భక్తులు భారీగా తరలిరావడంతో మిథిలా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సీతారామ నామాలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది.
Coronation of Lord Sri Rama in Bhadrachalam : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మణుగూరు ఎక్స్ప్రెస్ రైలులో గవర్నర్ గురువారం రాత్రి భద్రాచలం వెళ్లారు. కొత్తగూడెం వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి గవర్నర్ రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో గవర్నర్కు పుష్పగుచ్చాలతో అధికారులు స్వాగతం పలికారు. తమిళిసై వెంట రాజ్భవన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. శ్రీరాముడి పట్టాభిషేకంలో పాల్గొనేందుకు గత ఏడాది కూడా గవర్నర్ రైలులోనే వెళ్లారు.
విశ్వమంతా ఆదర్శంగా కీర్తించే సీతారాముల వివాహ వేడుక గురువారం భద్రాచలంలో భక్తులకు ఆద్యంతం వీనుల విందుగా సాగింది. మిథిలా మండపంలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.