విద్యనభ్యసించిన విద్యాసంస్థకు వీలైనంత చేయూత అందించాలి : తమిళి సై
Published : Dec 22, 2023, 6:03 PM IST
Governor Tamilisai at JNTU Meeting at Kukatpally : కళాశాలల్లో విద్య పూర్తి చేసి వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు, తాము చదివిన కళాశాలకు వీలైనంత సహకారం అందించేందుకు ముందుకు రావాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈరోజు కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీలో పలు అభివృద్ది పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ పూర్వ విద్యార్థులంతా కలిసి యూనివర్సిటీలో అభివృద్ది పనులకు తోడ్పాటు అందించటం, ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించటం అభినందనీయమని అన్నారు.
పూర్వ విద్యార్థుల కలయిక తమ ఆనందం కోసమే కాకుండా తాము విద్యనభ్యసించిన విద్యా సంస్థకు వీలైనంత చేయూత అందించే విధంగా ఉండాలని కోరారు. అంతకు ముందు మెకానికల్ ఇంజనీరింగ్ సెమినార్ హాల్ ప్రారంభం అనంతరం స్టేజీ పైకి వెలుతుండగా ప్రమాదవశాత్తు గవర్నర్ కింద పడ్డారు. వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది స్పందించి, ఆమెను పట్టుకొని పైకి లేపారు. ఆమెకు గాయాలేమీ కాలేదని అధికారులు తెలిపారు.