నిజామాబాద్లో భారీ అగ్నిప్రమాదం - నలుగురికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
Published : Dec 23, 2023, 12:21 PM IST
Fire Accident in Nizamabad : నిజామాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దేవీ రోడ్డులోని బాలాజీ సానిటరీ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతం మొత్తం విస్తరించింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైర్ ఇంజిన్ల సాయంతో నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపు చేసింది.
ఈ ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. దీంతో వీరంతా చికిత్స పొందుతున్నారు. భవనం పూర్తిగా దగ్ధం కాగా, ప్రమాదం వల్ల దాదాపు రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాలాజీ సానిటరీ యజమాని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.