CM KCR Public Meeting Arrangements in Husnabad : హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు శరవేగంగా పనులు.. పరిశీలించిన ఎమ్మెల్యే
Published : Oct 13, 2023, 7:48 PM IST
CM KCR Public Meeting Arrangements in Husnabad : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ నెల 15న జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సభ ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పరిశీలించారు. ఇప్పటికే హెలిప్యాడ్ నిర్మాణం పూర్తయిందని.. సభాస్థలి వేదిక పనులు శనివారంలోగా పూర్తవుతాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్కు లక్ష్మీ నియోజకవర్గమని, గతంలో 2014, 2018 రెండుసార్లు హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని బహిరంగ సభ ద్వారా ప్రారంభించారని గుర్తు చేశారు.
మూడోసారి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. కేవలం హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి లక్ష మంది ప్రజలు సభకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని.. మహిళలకు, వికలాంగులకు ప్రత్యేకమైన గ్యాలరీలు ఏర్పాటు చేశామని.. సభలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు.